హైదరాబాద్ : భారత త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులికతో పాటు 11 మంది సైనికులు దుర్మరణం చెందడం పట్ల యూఎస్ ఎంబసీ(అమెరికా రాయబార కార్యాలయం) సంతాపం ప్రకటించింది. భారత తొలి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్.. ఇండియన్ మిలటరీని అభివృద్ధి చేసేందుకు ఎంతో పాటుపడ్డారు అని పేర్కొన్నది. భారత రక్షణ శాఖను మరింత పటిష్టం చేసేందుకు కృషి చేశారని తెలిపింది.
ఈ ఏడాది సెప్టెంబర్లో ఐదు రోజుల పాటు యూఎస్ అంతటా ట్రావెల్ చేసిన బిపిన్ రావత్.. జనరల్ మార్క్ మిల్లితో మిలటరీ అభివృద్ధితో పాటు సారూప్య దేశాలతో సహకారాన్ని పెంపొందించుకునే అవకాశాలపై రావత్ చర్చించినట్లు తెలిపింది. ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో తీవ్రంగా గాయపడిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ త్వరగా కోలుకోవాలని యూఎస్ ఎంబసీ ఆకాంక్షించింది. కాన్సాస్లోని యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ కమాండ్ అండ్ జనరల్ స్టాఫ్ కాలేజీలో బిపిన్ రావత్ ఉన్నత విద్యను అభ్యసించిన సంగతి తెలిసిందే.