Starvation @ Afghan | ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితులు మరీ దారుణంగా మారాయి. వేలాది కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి. చేసేందుకు పనిలేక, వేరే దేశాలకు వలస వెళ్లలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. చిన్నారులకు ఆహారం ఇవ్వలేని చాలా కుటుంబాలు వారికి స్లీపింగ్ పిల్స్ ఇచ్చి నిద్రపుచ్చుతున్నాయి. కొన్ని కుటుంబాలు తమ ఆడపిల్లల్ని, కిడ్నీలను అమ్ముకుంటున్నారు. ఒక్కపూట భోజనం కూడా చేయలేని అధ్వాన పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. ఏడాది క్రితం ఆఫ్ఘనిస్తాన్ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ఇదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏ ఒక్క విదేశీ సాయం అందడం లేదు.
ఆకలితో అలమటిస్తున్న చిన్నారులకు నిద్రమాత్రలు వేసి నిద్రపుచ్చే పరిస్థితి నెలకొన్నది. చాలా మంది తమ కూతుళ్లను, కిడ్నీలను కూడా ఆహారం కోసం అమ్ముకుంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్లోని మూడవ అతిపెద్ద నగరమైన హెరాత్ శివారులో గడ్డితో కప్పి ఉన్న మట్టి ఇళ్లలో వేలాది మంది ప్రజలు మనుగడ కోసం పోరాడుతున్నారు. ఈ కుటుంబాలు నెల రోజుల్లో ఒక్క పూట కూడా భోజనం చేయలేకపోతుండటం విచారకరం. పిల్లలు ఆకలితో ఏడుస్తూ రాత్రి నిద్రపోలేక పోవడంతో వారికి మత్తు గోళీలు ఇస్తున్నారు. ప్రాణాలకు అపాయమని తెలిసినా.. తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడ నివసించే దాదాపు చాలా మంది ప్రజలు దీన్నే ఆచరిస్తున్నారు.
ఏఎఫ్పీ నివేదిక ప్రకారం, వివాహం పేరుతో ఆడ పిల్లల్ని అమ్ముతున్నారు. ఆకలి నుంచి కుటుంబసభ్యులను బయటపడేసేందుకు తల్లిదండ్రులు వారి కుమార్తెలను రూ.2-2.5 లక్షలకు అమ్ముకుంటున్నారు. తన ఐదేండ్ల కూతురిని రూ.90 వేలకు బలవంతంగా అమ్ముకోవాల్సి వచ్చిందని స్థానికుడు నిజాముద్దీన్ చెప్పాడు. పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్లోని చాలా ప్రాంతాల్లో ఇదే విధానాన్ని అవలంభిస్తున్న ప్రజలు.. తాము బతికేందుకు ఆడ పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో కిడ్నీలు అమ్ముకుని డబ్బు సంపాదిస్తున్నారని హెరాత్ క్యాంపులో ఉంటున్న నిరుపేద కుటుంబాలకు ఆహారం అందజేస్తున్న అబ్దుల్ రహీం అక్బర్ విచారం వ్యక్తం చేశారు. ఇది ఎంత మాత్రమూ ప్రభుత్వం సమస్య కాదని తాలిబాన్ ప్రతినిధి ఒకరు స్పష్టం చేయడం వారి ప్రభుత్వ విధానాలను ఎండగడ్తున్నదని చెప్పవచ్చు.