ఆర్థిక సంక్షోభంతో విలవిల్లాడుతున్న శ్రీలంకలో ఇంధనం నిల్వలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. తాజాగా వేసిన అంచనాల ప్రకారం, శ్రీలంక వద్ద ఉన్న ఇంధనం నిల్వలు కేవలం ఒక్కరోజు మాత్రమే సరిపోతాయని, ఆ తర్వాత పూర్తిగా అడుగంటుతాయని తెలుస్తోంది. ఈ మేరకు స్థానిక మీడియాలో వెలువడిన కథనాలు లంక ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నాయి.
సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ ట్రేడ్ యూనియన్ వర్గాల నుంచి ఈ సమాచారం వచ్చినట్లు శ్రీలంక మీడియా చెప్తోంది. ఇటీవలే శ్రీలంకలో ఇంధనం ధరలను ప్రభుత్వం మరోసారి పెంచింది. గత రెండు నెలల్లో ఇలా ఇంధనం ధరలు పెంచడం ఇది మూడోసారి.
ఈ క్రమంలోనే ప్రజలు సాధ్యమైనంత వరకు ఇంటి నుంచే పనులు చేయాలని, స్కూళ్లు కూడా ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని లంక ప్రభుత్వం సూచించింది. లంకకు అందుతాయని అనుకున్న ఇంధనం దిగుమతులు ఆలస్యం కావడంతోనే ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది.