శ్రీలంకలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు అక్కడి ప్రజానీకాన్ని అతలాకుతలం చేసేస్తున్నాయి. కనీసం జీవించడానికి కూడా అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు అమాంతంగా పెరిగిపోవడంతో బతుకులు దుర్భరమైపోతున్నాయి. కూరగాయల ధరలు ఎప్పటి కంటే రెండింతలు పెరిగాయి. బియ్యం, గోధుమలు కిలో 220 గా అమ్ముతున్నారు. ఇక పాల పౌడర్ కేజీ 1900 రూపాయలకు అమ్ముతున్నారు. ఇక చక్కెర కిలో 240 రూపాయలు, కొబ్బరి నూనె లీటర్ 850 రూపాయలు. ఒక్క గుడ్డు ధర 30 రూపాయలుగా వ్యాపారస్థులు అమ్ముతున్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఆర్థిక సంక్షోభంలో పూర్తిగా కూరుకుపోయిన శ్రీలంకలో ప్రజా నిరసనలు ఉద్ధృతం కావడంతో అధ్యక్షుడు రాజపక్స దేశవ్యాప్త ఎమర్జెన్సీ విధించారు. భద్రతా బలగాలకు అపరిమిత అధికారాలనిచ్చారు. నిరసన ప్రదర్శనలు ఎవరు నిర్వహించినా అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల భద్రత, అత్యవసర సేవల కోసం, నిత్యావసర వస్తువుల సరఫరాలో ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకే ఎమర్జెన్సీ నిర్ణయం తీసుకొన్నట్టు రాజపక్స పేర్కొన్నారు. ఎమర్జెన్సీ శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చింది. ఎమర్జెన్సీతో పాటు అధ్యక్షుడు రాజపక్స 36 గంటల దేశవ్యాప్త కర్ఫ్యూ విధించారు. కర్ఫ్యూ శనివారం సాయంత్రం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చింది. సోమవారం ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉంటుంది.