కొలంబో, మే 20: పెట్రోల్, డీజిల్ను కొనడానికి డబ్బుల్లేక శ్రీలంక ప్రభుత్వం శుక్రవారం బడులకు సెలవు ప్రకటించింది. అత్యవసర సేవల విభాగాల్లో ఉన్నవారు తప్ప ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ కార్యాలయాలకు రావొద్దని ఆదేశించింది.
బడులు, ఆఫీసులు మూసేస్తే పెట్రోల్కు డిమాండ్ కొంచెమైనా తగ్గుతుందని ప్రభుత్వం ఆశ. అందుకే శ్రీలంక ప్రభుత్వం ఈ అసాధారణ నిర్ణయం తీసుకొన్నది. పెట్రోల్ బంకుల్లో ఇప్పటికే వేలాది మంది లైన్లలో నిల్చున్నారు. మరోవైపు, నిత్యావసరాలకు కూడా కటకటగా మారింది. దుకాణాల్లో స్టాక్ తక్కువగా ఉండటంతో నిత్యావసరాల కోసం ప్రజలు కొట్టుకొంటున్నారు. శ్రీలంక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు ఇంకా కొనసాగుతున్నాయి.