కొలంబో, ఏప్రిల్ 5: ఆర్థిక సంక్షోభంతో పాటు రాజకీయ సంక్షోభం శ్రీలంకను కుదిపేస్తున్నది. ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టి 24 గంటలు గడువక ముందే అలీసబ్రీ తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో తాను ఈ పదవిలో కొనసాగలేనని పేర్కొన్నారు. తన సోదరుడు ఆర్థికమంత్రి బాసిల్ రాజపక్సను పదవి నుంచి తొలగించి ఆయన స్థానంలో మొన్నటివరకూ న్యాయశాఖ మంత్రిగా కొనసాగిన అలీసబ్రీని సోమవారం అధ్యక్షుడు గొటబయ రాజపక్స నియమించడం తెలిసిందే. మరోవైపు గొటబయ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరిస్తున్నట్టు మంగళవారం కొన్ని మిత్రపక్షాలు ప్రకటించాయి. దీంతో పార్లమెంట్లో రాజపక్స సర్కారు మైనార్టీలో పడిపోయింది.
అధికార శ్రీలంక పోడుజన పెరమున (ఎస్ఎల్పీపీ) నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరిస్తున్నట్టు వివిధ పార్టీలకు చెందిన 41 మంది ఎంపీలు ప్రకటించారు. దీంతో 225 సభ్యులున్న పార్లమెంట్లో అధికార కూటమి బలం 150 నుంచి 109కి పడిపోయింది. మ్యాజిక్ మార్క్ 113 కంటే 4 సీట్లు తక్కువగా ఉండటంతో రాజపక్స సంకీర్ణ ప్రభుత్వం మెజార్టీ కోల్పోయినట్లయింది. అయితే శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ భిన్నంగా ఉంటుంది. ప్రజలే ప్రత్యక్షంగా అధ్యక్షుడిని ఎన్నుకొంటారు. 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన వాళ్లే అధ్యక్షుడవుతారు. కాబట్టి అధికారంలోని సంకీర్ణ ప్రభుత్వం పార్లమెంట్లో మెజార్టీ కోల్పోయినప్పటికీ అధ్యక్షుడు రాజపక్స పదవికి రాజీనామా చేసే అవకాశం ఉండకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
దేశంలో నెలకొన్న ఆహార, ఆర్థిక సంక్షోభాన్ని నిరసిస్తూ న్యాయవాదులు, విద్యార్థులు వర్షాన్ని కూడా లెక్కచేయకుండా కొలంబోలో నిరసన ప్రదర్శనలను ఉద్ధృతం చేశారు. ప్రధాని మహీంద రాజపక్స ఇంటిముందు నినాదాలు చేశారు. దిగుమతులు నిలిచిపోవడంతో శ్రీలంకలో తీవ్ర ఔషధాల కొరత ఏర్పడింది. దీంతో దేశంలో మంగళవారం ఆరోగ్య అత్యవసర స్థితిని విధించారు. ఆర్థిక సమస్యల రీత్యా నార్వే, ఇరాక్, ఆస్ట్రేలియాలోని దౌత్య కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. శ్రీలంకలో మారుతున్న రాజకీయ, ఆర్థిక పరిణామాలను క్షుణ్ణంగా గమనిస్తున్నట్టు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) తెలిపింది. మరోవైపు, శ్రీలంకలో అధ్యక్షుడి పాలనా వ్యవస్థకు స్వస్తి పలుకాల్సిన అవసరమున్నదని విపక్ష నాయకుడు సాజిత్ ప్రేమదాస మంగళవారం నొక్కి చెప్పారు. దేశంలో కొత్త ఎన్నికల వ్యవస్థ రావాలని చెప్పారు.