కొలంబో : శ్రీలంకలో తీవ్ర ఆహార కొరత ( Food Crisis ) ఏర్పడింది. దీంతో ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. ప్రైవేటు బ్యాంకుల్లో విదేశీ మారక నిలువలు కూడా అడగంటడంతో.. సరుకు దిగుమతులకు కూడా సమస్య ఏర్పడింది. దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొన్నట్లు అధ్యక్షుడు గొటబయ రాజపక్స తెలిపారు. ఈ నేపథ్యంలో అత్యయిక ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన చెప్పారు. చక్కర, బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులను నిల్వ చేసేవారి పట్ల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వరి, బియ్యం, చక్కర, ఇతర నిత్యావసర వస్తువుల సరఫరాను సమీక్షించేందుకు ఓ ఆర్మీ ఆఫీసర్ను కమిషనర్గా నియమిస్తూ రాజపక్ష ఆదేశాలు జారీ చేశారు. దేశవ్యాప్తంగా షుగర్, బియ్యం, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో కిరాణా షాపుల వద్ద భారీ సంఖ్యలో జనం బారులు తీరుతున్నారు. పౌల పౌడరు, కిరోసిన్, వంట గ్యాస్ స్టోర్ల వద్ద కూడా జనం క్యూ కట్టడం ఆందోళన కలిగిస్తున్నది. నిత్యావసరాలను హోర్డింగ్ చేస్తున్నవారిపై భారీగా జరిమానా వసూల్ చేస్తున్నారు. కరోనా మహమ్మారి వల్ల శ్రీలంక ఆర్థిక వ్యవస్థ క్షీణించింది. మాంద్యాన్ని తట్టుకునేందుకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ శ్రీలంక కొన్ని ఉద్దీపనలు ప్రకటించినా ఫలితం దక్కలేదు. శ్రీలంక విదేశీ మారక నిలువలు గడిచిన రెండేళ్లలో 7.5 బిలియన్ల డాలర్ల నుంచి 2.8 బిలియన్ల డాలర్లకు పడిపోయింది.