Sri Lanka Crisis | తప్పుడు ఆర్థిక విధానాలు, నాయకత్వ లోపం కారణంగా శ్రీలంక తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ద్రవ్యోల్బణం సైతం గరిష్ఠ స్థాయికి చేరుకుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం లంక సహాయం కోసం ఇతర దేశాల వైపు చూడాల్సిన దుస్థితి నెలకొన్నది. సంక్షోభం మధ్య ప్రజల నుంచి ఎదురైన నిరసనల నేపథ్యంలో సింగపూర్కు పారిపోయిన మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్స శ్రీలంక దయనీయ స్థితికి కరోనా, లాక్డౌన్ కారణాలని పేర్కొన్నాడు. గోటబయ రాజపక్స నెల 14న పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజీనామాకు ముందు మాల్దీవుల నుంచి సింగపూర్కు పారిపోయాడు.
ఆ తర్వాత పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి సింగపూర్ నుంచి పంపిన రాజీనామాను చదివి వినిపించారు. గోటబయ రాజపక్స తన రాజీనామాలో ‘నేను నా శక్తి మేరకు నా మాతృభూమికి సేవ చేశాను. భవిష్యత్లో అలాగే కొనసాగిస్తాను’ అన్నారు. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించడం తదితర అద్భుతమైన చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. అధ్యక్షుడిగా నియాకమైన మూడు నెలల్లోనే ప్రపంచ మొత్తం కరోనా మహమ్మారి బారినపడిందని, ఆ తర్వాత నిర్బంధాల నేపథ్యంలో మహమ్మారి నుంచి ప్రజలను రక్షించేందుకు తనవంతు ప్రయత్నం చేశానని చెప్పుకొచ్చారు.