Sri Lanka Crisis | శ్రీలంకలో కొనసాగుతున్న నిరసనల మధ్య సోమవారం అఖిలపక్ష మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటుపై ఒప్పందం కుదిరింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అనంతరం శ్రీలంక మంత్రివర్గం రాజీనామా చేసేందుకు అంగీకరించిందని ప్రధాని రణిల్ విక్రమసింఘే కార్యాలయం సోమవారం తెలిపింది. గత కొద్ది నెలలుగా పొరుగు దేశం శ్రీలంకలో ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నది. సంక్షోభం మధ్య పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. అధ్యక్షుడు గోటబయ రాజపక్స భవనాన్ని విడిచి పరారయ్యారు. అనంతరం నిరసనకారులు అధ్యక్షుడి భవనాన్ని ఆక్రమించారు. ప్రధాని విక్రమసింఘే నివాసానికి సైతం నిప్పుపెట్టారు.
ఆ తర్వాత అధ్యక్షుడు రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తాను సైతం తప్పుకోనున్నట్లు ప్రధాని విక్రమసింఘే తెలిపారు. అధ్యక్షుడు గోటబయ, ప్రధాని విక్రమసింఘే రాజీనామాకు అంగీకరించడంతో ప్రతిపక్షాలు ఆదివారం చర్చలు జరిపి అఖిలపక్ష మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదిరిన వెంటనే ఆ ప్రభుత్వానికి తమ బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని చర్చలో పాల్గొన్న మంత్రులు చెప్పినట్లు ప్రధాని కార్యాలయం పేర్కొంది. ప్రభుత్వ ఏర్పాటు అంశంపై పార్లమెంట్ స్పీకర్తో మాట్లాడనున్నట్లు అఖిలపక్ష వర్గాలు పేర్కొన్నాయి.