కొలంబో, జూన్ 20: శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ఆ దేశ ప్రభుత్వం పలువిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నది. ఇందులో భాగంగా ప్రకటించిన రెండు వారాల షట్డౌన్ సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. దేశంలో చమురు నిల్వలు నిండుకున్న నేపథ్యంలో ఆయిల్ను ఆదా చేసేందుకు అత్యవసర మినహా బడులు, ప్రభుత్వ కార్యాలయాలు మూసేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా పాఠశాలలు మూతపడ్డాయి. ప్రభుత్వ కార్యాలయాలు నామమాత్రపు సిబ్బందితో పనిచేస్తున్నాయి. మరోవైపు అధ్యక్షుడు గొటబయ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కొలంబోలోని అధ్యక్ష కార్యాలయాన్ని ముట్టడించారు. పోలీసులు 21 మందిని అరెస్టు చేశారు. అధ్యక్షుడి కంటే పార్లమెంట్కు ఎక్కువ అధికారాలు ఉండేలా ప్రతిపాదిత 21 రాజ్యాంగ సవరణకు శ్రీలంక క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇది త్వరలో పార్లమెంట్ ముందుకు రానున్నదని మంత్రులు తెలిపారు. దేశ ప్రధాని రణిల్ విక్రమ సింఘే సోమవారం ఐఎంఎఫ్ బృందంతో చర్చలు జరిపారు.