వాషింగ్టన్: అంతరిక్షంలోని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)కు రాకెట్ శిథిలాల ముప్పు పొంచి ఉన్నది. 1994లో ప్రయోగించిన రాకెట్ శిథిలాలు శుక్రవారం దీని సమీపం నుంచి వెళ్లనున్నాయి. ఈ నేపథ్యంలో రాకెట్ శిథిలాల వల్ల కలిగే ముప్పును నివారించేందుకు స్పేస్ స్టేషన్ కక్ష్యను మార్చాలని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) నిర్ణయించింది. భారతీయ కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 4 గంటలకు మిషన్ కంట్రోల్ ద్వారా ఐఎస్ఎస్ కక్ష్యను కాస్త తగ్గించనున్నది. ఈ చర్య వల్ల అందులోని వ్యోమగాములకు ఎలాంటి ప్రమాదం వాటిల్లదని నాసా అంతర్జాతీయ బృందం పేర్కొంది.
కాగా, 1994 మే 19న పెగాసస్ రాకెట్ను ప్రయోగించారు. 1996 జూన్ 3న రాకెట్ విచ్ఛిన్న సమయంలో ఆబ్జెక్ట్ 39915 అని పిలిచే శిథిలాలు ఏర్పడ్డాయి. ఈ రాకెట్ శిథిలాలు నాటి నుంచి భూమి చుట్టూ ఉన్న అంతరిక్షంలోని శూన్యంలో తేలుతూనే ఉన్నాయి.
మరోవైపు ఐఎస్ఎస్లోని వ్యోమగాములు టామ్ మార్ష్బర్న్, కైలా బారన్ ఇటీవల స్పేస్వాక్ నిర్వహించారు. శిథిలాల తాకిడి కారణంగా విరిగిన ఐఎస్ఎస్ యాంటెన్నాను తొలగించారు. 20 ఏండ్లకుపైగా ఏర్పాటు చేసిన ఈ పరికరం ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి పనిచేయడం లేదు.