సియోల్, ఫిబ్రవరి 16: ఆహారం ద్వారా అధిక ప్రోటీన్లు పొందాలనుకొనేవారికి శుభవార్త. దక్షిణ కొరియాలోని యోన్సీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కొత్త రకం హైబ్రీడ్ నాన్వెజ్ రైస్ (మాంసం బియ్యం)ని సృష్టించారు. ఈ బియ్యంలో పశు మాంసం, కొవ్వు కణాలుండేలా ప్రయోగశాలలో సాగు చేస్తారు. ఇందుకోసం ముందుగా బియ్యానికి చేపల నుంచి తీసిన జిగురు లాంటి పదార్థాన్ని పూస్తారు. దీనివల్ల పశు మాంస కణాలు దానికి అతుక్కుపోతాయి. తర్వాత వాటిని 11 రోజుల పాటు ఒక పాత్రలో సాగు చేస్తారు.
సాధారణ బియ్యం కంటే 8 శాతం ప్రొటీన్లు, 7 శాతం కొవ్వు ఎక్కువగా ఉంటాయి. ఇవి అందుబాటులో ధరలో, పర్యావరణ హితంగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మేటర్ జర్నల్ కథనం ప్రకారం కరువు, సైనిక రేషన్, అంతరిక్ష ఆహారంగా ఈ నాన్వెజ్ రైస్ని వాడుకోవచ్చు. ప్రయోగశాలలో తయారయ్యే ఈ బియ్యం వల్ల కర్బన ఉద్గారాలు తగ్గుతాయని, మాంసం కోసం పశువుల్ని పెంచే అవసరం తప్పుతుందని సైంటిస్టులు చెప్తున్నారు. ఈ రకంగా ఇవి పర్యావరణ హితమైనవని విశ్లేషిస్తున్నారు. అయితే ఈ బియ్యాన్ని ప్రజలు ఏ మేరకు ఆదరిస్తారనేది పెద్ద ప్రశ్నగా మారింది.