మొగదిషు: సోమాలియాలో (Somalia) ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. రాధాని మొదగిషుకు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిస్మయో నగరంలోని ఓ హోటల్పై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో తొమ్మిది మంది దుర్మరణం చెందారు. తొలుత పేలుడు పదార్థాలతో నింపిన కారుతో తవక్కల్ హోటల్ గేటును ఢీకొట్టి ఆత్మహుతి దాడికి పాల్పడ్డారు. అనంతరం హోటళ్లోకి ప్రవేశించిన సాయుధులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. దీంతో తొమ్మిది మరణించగా, మరో 47 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించినవారిలో నలుగురు భద్రతా సిబ్బంది, విద్యార్థులు ఉన్నట్లు సెక్యూరిటీ మినిస్టర్ యూసుఫ్ హుస్సేన్ ధుమాల్ వెల్లడించారు.
ఉగ్రవాదులు దాడిచేసిన హోటల్ సమీపంలో ఓ పాఠశాల ఉందని, పేలుళ్ల నేపథ్యంలో చాలా మంది విద్యార్థులు గాయపడ్డారని తెలిపారు. కాగా, భద్రతా బలగాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని, ఆత్మాహుతి దాడిలో మరో ఉగ్రవాది చనిపోయాడని చెప్పారు. కాగా, ఈదాడికి బాధ్యత వహిస్తూ అల్-షబాబ్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. అల్ఖైదాతో సన్నిహిత సబంధాలున్న అల్-షబాబ్ సోమాలియాలో తరచూ విధ్వంసానికి పాల్పడుతున్నది.