న్యూయార్క్: పొగ తాగేవారికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) షాకింగ్ న్యూస్ చెప్పింది. వారిలో కరోనావల్ల మరణించే ముప్పు 50 శాతం అధికంగా ఉంటుందని WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ తెలిపారు. అదేవిధంగా క్యాన్సర్, గుండె సంబంధిత సమస్యలు, కరోనావల్ల తలెత్తే శ్వాస సమస్యలు సోకే ముప్పు కూడా స్మోకర్స్కు అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. పొగాకు నివారణలో భాగంగా WHO నిర్వహిస్తున్న ‘కమిట్ టు క్విట్’ అవగాహన సదస్సులో టెడ్రోస్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కరోనావల్ల తలెత్తే ముప్పునకు దూరంగా ఉండాలంటే పొగ తాగేవారు ఇక నుంచి ఆ పొగాకుకు దూరంగా ఉండటమే మేలైన మార్గమని టెడ్రోస్ స్పష్టం చేశారు. పొగాకు రహిత వాతావరణాన్ని సృష్టించడం కోసం WHO చేస్తున్న కార్యక్రమంలో ప్రతి దేశం పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. తద్వారా ప్రజలు పొగాకు వదిలిపెట్టేందుకు కావాల్సిన సమాచారం, మద్దతు లభిస్తాయని పేర్కొన్నారు. క్విట్ ఛాలెంజ్ పేరిట వాట్సాప్, ఫేస్బుక్, వైబర్, వీ చాట్లో కావాల్సిన సమాచారం అందుతుందన్నారు.
అదేవిధంగా పొగాకు రహిత సమాజం కోసం WHO చేస్తున్న కృషికి భారత్ నుంచి లభిస్తున్న సహకారం గురించి ఈ సందర్భంగా టెడ్రోస్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ-సిగరెట్లు, హీటెడ్ టొబాకో ప్రొడక్ట్స్ (హెచ్టీపీ) ను నిషేధిస్తూ భారత్లో చట్టం తీసుకొచ్చినందుకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.