కాబూల్: ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్లు తొలగించిన సిక్కు మత జెండాను పునరుద్ధరించారు. తూర్పు ఆఫ్ఘనిస్థాన్లోని పక్తియా ప్రావిన్స్లో ప్రసిద్ధ గురుద్వారా వద్ద సిక్కు మత జెండాను తాలిబన్లు గురువారం తొలగించారు. చమ్కని ప్రాంతంలోని గురుద్వారా థాల సాహిబ్ పైకప్పుపై ఎగిరే నిషాన్ సాహిబ్ను తీసివేశారు. సిక్కు మత స్థాపకుడు గురు నానక్ సందర్శించిన ఈ చారిత్రక గురుద్వారా పట్ల అపవిత్రంగా వ్యవహరించారు.
ఈ ఘటనను భారత్తోపాటు అంతర్జాతీయంగా సిక్కు సమాజం ఖండించింది. ఆప్ఘనిస్థాన్లోని మైనార్టీలు, మహిళలకు రక్షణతోనే ఆ దేశ భవిష్యత్ ఆధారపడి ఉంటుందని భారత్ స్పష్టం చేసింది. భారత్ ఖండనతోపాటు అంతర్జాతీయంగా వచ్చిన ఒత్తిడి నేపథ్యంలో తాలిబన్ అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది గురుద్వారా థాల సాహిబ్ను సందర్శించారు. సిక్కు మత జెండా నిషాన్ సాహిబ్ను తిరిగి ఏర్పాటు చేశారు. అక్కడ గురుద్వారా కొనసాగుతుందని, సిక్కు మత సంప్రదాయం ప్రకారం కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని తాలిబన్ తెలిపింది.
కాగా, ఆఫ్ఘన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ తర్వాత తాలిబన్లు చెలరేగిపోతున్నారు. పలు సరిహద్దు జిల్లాలపై దాడులు చేసి తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలపై ఆంక్షలు, కఠిన నిబంధనలు విధించడంతోపాటు అరాచకాలకు పాల్పడుతున్నారు.