వాషింగ్టన్ : అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. సోమవారం వాషింగ్టన్ డీసీలోని ఈశాన్య ప్రాంతంలో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. తూటాలకు తీవ్ర గాయాలతో ఒకరు మృతి చెందగా.. ఐదుగురు గాయపడ్డట్లు సమాచారం. ఎఫ్ స్ట్రీట్ ఎన్ఈలోని 1500 బ్లాక్లో కాల్పులు జరిగాయి. ఘటనపై విచారణ జరుపుతున్నట్లు వాషింగ్టన్ డీసీ పోలీసులు తెలిపారు. మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్మెంట్ (MPD) ప్రకారం.. సోమవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఆరుగురు గాయపడ్డారని, ఒకరు మరణించారని ఎంపీడీ చీఫ్ రాబర్ట్ కాంటి ధ్రువీకరించారు.
అయితే, కాల్పులకు కారణాలు తెలియరాలేదని, నిందితుడి పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. అయితే, దాదాపు 15 సార్లు తుపాకీ కాల్పుల శబ్దం విన్నట్లు ఓ మహిళ తెలిపింది. ఘటన అనంతరం అంబులెన్స్లు, స్థానికులు ఆ ప్రాంతంలో గుమిగుడారు. ఇటీవల అమెరికాలో తుపాకీ కాల్పులు వరుసగా చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. హింసాత్మక సంఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలు, కుటుంబాలను రక్షించేందుకు తుపాకీలపై నిషేధించాలని, లేదంటే వాటిని కొనుగోలు చేసే వయసు 18 నుంచి 21కి పెంచాలని ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు.