న్యూఢిల్లీ: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు (Sri Lanka) భారత్ చేయుతనందిస్తున్నది. రవాణా రంగంలో కీలక పాత్ర పోషించే డీజిల్ను లంకకు అందించింది. బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన 40 వేల టన్నుల డీజిల్ను ద్వీప దేశానికి అప్పుగా సరఫరా చేసింది. భారత్ నుంచి బయలుదేరిన ప్రత్యేక ఓడ శనివారం ఉదయం శ్రీలంకకు చేరుకున్నది. దీనిని సాయంత్రం వరకు దేశవ్యాప్తంగా సరఫరా చేయనున్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఇండియన్ ఆయిల్ సంస్థ.. ఆరు వేల టన్నుల డీజిల్ను అందించనుంది.
శ్రీలంక రవాణారంగంలో బస్సులు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఇందులో మూడింటా రెండొంతుల వాహనాలు ప్రైవేటు రంగంలోనే ఉన్నాయి. వాటికి సరిపడా డీజిల్ అందుబాటులో లేకపోవడంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. దీంతో రాజపక్స ప్రభుత్వం భారత్ సాయం కోరింది.
కాగా, దేశంలో పెరిగిన ధరలకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలు చేస్తుండటంతో అధ్యక్షుడు గొటబయ రాజపక్స ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం అర్ధరాత్రిదాటిన తర్వాత గెజిట్ విడుదల చేశారు. ప్రజలకు రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ, అత్యవసర సరుకులు, సేవల నిర్వహణ కోసం ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.