ఢాకా, జనవరి 7: బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా షేక్ హసీనా వరుసగా నాలుగోసారి ఎన్నిక కానున్నారు. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికార అవామీ లీగ్ పార్టీ మూడింట రెండొంతుల సీట్లను కైవసం చేసుకున్నది. సోమవారం ఉదయానికి పూర్తి ఫలితాలు వెల్లడికానున్నాయి. గోపాల్గంజ్-3లో హసీనా ఎనిమిదో సారి విజయం సాధించారు. 1986 నుంచి ఇక్కడ నెగ్గుతూ వస్తున్న హసీనాకు 2,49,965 ఓట్లు రాగా, బంగ్లాదేశ్ సుప్రీం పార్టీకి చెందిన నిజాముద్దీన్ లష్కర్కు కేవలం 469 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. 76 ఏండ్ల హసీనా 2009 నుంచి వరుసగా బంగ్లాదేశ్లో అధికారం చేపడుతూ వస్తున్నారు.
దేశంలో మొత్తం 300 స్థానాలు ఉండగా, కడపటి వార్తలందేసరికి అవామీ లీగ్ 200 స్థానాల్లో నెగ్గినట్టు తెలిసింది. ఆదివారం ఆ దేశ సాధారణ ఎన్నికల్లో అతి తక్కువగా 40 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ ఎన్నికలను ప్రధాన ప్రతిపక్షం బీఎన్పీ, దాని సంకీర్ణ పార్టీలు బహిష్కరించడంతో హసీనా ఎన్నిక లాంఛనం కానుంది. చెదురుమదరు హింసాత్మక ఘటనలతో ఓటింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. అనంతరం కౌంటింగ్ ప్రారంభించారు. సోమవారం ఉదయం నాటికి పూర్తి ఫలితాలు వెల్లడి కావచ్చునని ఎన్నికల కమిషనర్ ఖాజీ హబీబుల్ ఆవల్ తెలిపారు. హసీనా ప్రధాని కానుండటం ఇది వరుసగా నాలుగోసారి కాగా, మొత్తంగా ఐదోసారి.