హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ సభ్యులుగా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ కే అరుణకుమారి, మాజీ రెవెన్యూ ఉద్యోగి కారం రవీందర్రెడ్డిని నియమించటం పట్ల రెవెన్యూ ఉద్యోగసంఘాలు హర్షం వ్యక్తంచేశాయి. రెవెన్యూ అధికారులకు సముచిత స్థానం కల్పించినందుకు సీఎం కేసీఆర్కు తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా), తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ ధన్యవాదాలు తెలిపాయి. ఈ నిర్ణయం రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమంలో భాగస్వాములు అవుతున్న ప్రతి రెవెన్యూ ఉద్యోగికి దక్కిన గుర్తింపు అని డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రమోహన్, ప్రధాన కార్యదర్శి డీ శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయంతో రెవెన్యూ ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహం నింపిందని ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్ తెలిపారు.
ముందునుంచీ టీఎన్టీవోకు మంచి గుర్తింపు: మామిళ్ల రాజేందర్, రాయకంటి ప్రతాప్
తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన టీఎన్జీవో సంఘానికి మొదటినుంచీ సీఎం కేసీఆర్ గుర్తింపు ఇస్తున్నారని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, రాయకంటి ప్రతాప్ తెలిపారు. టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు రవీందర్రెడ్డిని టీఎస్పీఎస్సీ సభ్యుడిగా నియమించటమే మరో ఉదాహరణ అన్నారు.
లింగారెడ్డికి అభినందనలు: సండ్ర
టీఎస్పీఎస్సీ సభ్యుడిగా బండి లింగారెడ్డి నియమితులు కావటం పట్ల సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య హర్షం వ్యక్తం చేశారు. లింగారెడ్డికి తన హృదయ పూర్వక అభినందనలు తెలుపుతున్నట్టు తెలిపారు.
పనిచేసేవారికి గుర్తింపు: శ్రీరంగారావు
గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్యసేవలు అందిస్తూ పార్టీ శ్రేయస్సు కోసం పాటుపడిన చంద్రశేఖర్రావుకు సీఎం కేసీఆర్ సముచిత స్థానం కల్పించారని రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి చైర్మన్ శ్రీరంగారావు అన్నారు. పనిచేసేవారికి అవకాశాలు తప్పకుండా వస్తాయనేందుకు ఈ నియామకమే నిదర్శనమని చెప్పారు. చంద్రశేఖర్రావు నియామకానికి సహకరించిన మంత్రులు కేటీఆర్, హరీశ్రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.