Earthquake | టర్కీని వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. సోమవారం తెల్లవారు జామున రిక్టర్ స్కేల్పై 7.8 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. పెను ప్రకంపనలు సిరియా సైతం తాకాయి. శతాబ్దంలో వచ్చిన అత్యంత శక్తివంతమైన భూకంపం ధాటికి భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. ఇప్పటి వరకు దాదాపు 1612మంది వరకు మృత్యువాతపడగా.. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలున్నాయి.
ఓ వైపు సహాయక చర్యలు చేపడుతున్న నేపథ్యంలోనే మధ్యాహ్నం ఆగ్నేయ టర్కీలో రిక్టర్ స్కేల్పై 7.6 తీవ్రతతో రెండోసారి భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 1.24 గంటలకు ఎకినోజు పట్టణానికి దక్షిణ ఆగ్నేయంగా నాలుగు కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం గుర్తించినట్లు అధికారులు తెలిపారు. సిరియా జాతీయ భూకంపం కేంద్ర అధిపతి రేద్ అహ్మద్ ప్రభుత్వ అనుకూల రేడియోతో మాట్లాడుతూ చరిత్రలో నమోదైన అతిపెద్ద భూకంపమన్నారు.
తాజా లెక్కల ప్రకారం సిరియా ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ప్రాంతాల్లో కనీసం 700 మంది మరణించారని తెలిపారు. టర్కీలో కనీసం 912 మంది మరణించారని టర్కీ అధ్యక్షుడు ఎర్డగోన్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. భూకంపం కారణంగా ఇప్పటికే వేలాది మంది గాయాలపాలవగా.. మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నది. దాదాపు మూడుకోట్ల మందికిపైగా నిరాశ్రయులయ్యారు.
వరుసగా రెండు భూకంపాలు సంభవించడంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా.. టర్కి, సిరియాలో భూకంపంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. గాయపడ్డ వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. భారత్ టర్కికీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపింది. టర్కికీ వైద్య బృందాలు, మందులను పంపింది.