కాఠ్మండూ: నేపాల్ తారా ఎయిర్కు చెందిన ట్విన్-ఇంజిన్ విమానం 9ఎన్-ఏఈటీ ఆచూకీ ఇంకా తెలియలేదు. అయితే ఆ విమానం ఎక్కడ ఉన్నది అన్నది అధికారులు గుర్తించారు. కాగా, రాత్రి కావడంతోపాటు హిమపాతం నేపథ్యంలో సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్ నిలిపివేశారు. దీంతో ఆ విమానంతోపాటు అందులో ప్రయాణిస్తున్న 22 మంది పరిస్థితి గురించి ఇంకా ఏమీ తెలియలేదు. ఆదివారం ఉదయం ఏటీసీతో సంబంధాలు పూర్తిగా తెగిపోయిన ఈ విమానం కూలిపోయి ఉంటుందని ఆ దేశ అధికారులు అనుమానిస్తున్నారు. 22 మంది ప్రయాణికుల్లో నలుగురు భారతీయులు, ముగ్గురు జపాన్ పౌరులు కాగా మిగతా వారంతా నేపాల్ పౌరులే.
కాగా, విమానం ఆదివారం ఉదయం 9.55 గంటల పోఖ్రా నుంచి జోమ్సోమ్కు బయల్దేరిందని, ఆ తర్వాత ఏటీసీతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయని నేపాల్ అధికారులు తెలిపారు. పైలట్ ఫోన్ను ట్రాకింగ్ చేయడం ద్వారా ఈ విమానాన్ని ముస్తాంగ్ జిల్లాలోని జోమ్సోమ్ ప్రాంతంలో మొదట గుర్తించామని, తర్వాత మౌంట్ ధౌలగిరి వైపు మళ్లిందని అధికారులు చెప్పారు.
మరోవైపు మనపతి హిమాల్ కొండచరియల కింద లాంచే నది ముఖద్వారం వద్ద ఆ విమానం కూలిపోయిందని నేపాల్ ఆర్మీ అధికార ప్రతినిధి నారాయణ్ సిల్వాల్ తెలిపారు. స్థానికుల ద్వారా ఈ విషయం తెలిసిందన్నారు. దీంతో ఆ ప్రాంతానికి చేరుకునేందుకు ఆర్మీ ప్రయత్నిస్తున్నదని వెల్లడించారు.