జెనీవా, జనవరి 16: పరిమితికి మించి ఉప్పు వాడకంతో(రోజుకు 5 గ్రాములు మించి) మానవ ఆరోగ్యంపై ఊహించని స్థాయిలో నష్టం వాటిల్లుతున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆందోళన వ్యక్తం చేసింది. శరీరంలో కీలక అవయవాలు దెబ్బతిని ఏటా ప్రపంచవ్యాప్తంగా 18.9 లక్షల మంది చనిపోతున్నారని డబ్ల్యూహెచ్వో అంచనా వేసింది. రక్తపోటు, గుండె సమస్యలు, గ్యాస్ట్రిక్ క్యాన్సర్, స్థూలకాయం, కిడ్నీ వ్యాధులు బారినపడే అవకాశం పెంచుతుందని తెలిపింది. శరీరంలో ‘సోడియం’ కీలకమే అయినా, రోజుకు 2000 మిల్లీగ్రాములు మించి తీసుకోకూడదు. 5 గ్రాముల ఉప్పు లేదా ఒక టేబుల్ స్పూన్లో సోడియం 2000 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది.
క్రమంగా తగ్గించాలి!
ఉప్పు వాడకం నుంచి క్రమంగా బయటపడాలి. ఉప్పుకు బదులు నిమ్మరసం, వెనిగర్, వోమ, నానబెట్టిన సబ్జ గింజలు మొదలైనవి ఆహారంలో వాడొచ్చునని డబ్ల్యూహెచ్వో సూచిస్తున్నది. ప్రాసెస్ చేసిన ఆహారం మానేయాలి. తప్పదనుకుంటే 100 నుంచి 120 మిల్లీగ్రాముల వరకు సోడియం ఉన్న ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకొవచ్చు.