కీవ్: చెర్నోబిల్ అణు విద్యుత్తు కేంద్రాన్ని తిరిగి ఉక్రెయిన్ చేజిక్కించుకున్నది. రష్యా దళాలు ఆ ప్లాంట్ను వదిలేసినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్పై ఆక్రమణకు వెళ్లిన రష్యా.. ఆరంభంలోనే చెర్నోబిల్ న్యూక్లియర్ ప్లాంట్ను స్వాధీనం చేసుకున్నది. తాజాగా అణు కేంద్రం వద్ద తీవ్ర స్థాయిలో కలుషితం ఏర్పడినట్లు తెలుస్తోంది. దీని వల్లే రష్యా సైనికులు ఆ ప్రాంతాన్ని వీడినట్లు అనుమానిస్తున్నారు. సమీప అడవుల్లో పూడికలు తీయడంతో.. సైనికులకు స్వల్ప స్థాయిలో రేడియేషన్ జరిగిందని, దాని వల్లే ఆ ప్రాంతాన్ని సైనికులు వీడినట్లు పవర్ కంపెనీ ఎనర్గోటమ్ పేర్కొన్నది.
చెర్నోబిల్ నుంచి రష్యా దళాలు వెళ్లిపోయినట్లు తమకు ఉక్రెయిన్ చెప్పిందని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ పేర్కొన్నది. రాతపూర్వకంగానే చెర్నోబిల్ను ఉక్రెయిన్ దళాలకు రష్యా అప్పగించినట్లు ఐఏఈఏ తెలిపింది. చెర్నోబిల్ సైట్ వద్ద ఇతరులు ఎవరూ లేరని అక్కడి స్టాఫ్ చెప్పింది. 1986లో చెర్నోబిల్ న్యూక్లియర్ ప్లాంట్లో పెను విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. వాస్తవానికి ఇప్పుడు అక్కడ న్యూక్లియర్ రియాక్టర్ లేదు కానీ ప్లాంట్ను మేనేజ్ చేయాల్సి వస్తోంది.
ఎంత మంది సైనికులు రేడియేషన్కు లోనయ్యారో ఎనర్గోటన్ కంపెనీ స్పష్టం చేయలేదు. కొందరు సైనికులకు హై డోసులో రేడియేషన్ తగిలినట్లు తెలుస్తోంది. దీని గురించి అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ సంస్థ మరింత సమాచారాన్ని సేకరిస్తోంది.