కీవ్/దావోస్, మే 24: రెండు నెలల క్రితం రష్యా అధ్యక్షుడు పుతిన్పై హత్యాయత్నం జరిగిందని, దాని నుంచి ఆయన తప్పించుకున్నారని ఉక్రెయిన్ రక్షణ నిఘా విభాగాధిపతి కైరిలో బుడనోవ్ సంచలన విషయం వెల్లడించారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రారంభమైన కొద్ది రోజులకే ఇది జరిగిందని పేర్కొన్నారు. నల్లసముద్రం, కాస్పియన్ సముద్రం మధ్య ఉండే కాకసస్ రీజియన్ పర్యటనలో అక్కడి ప్రతినిధులు దాడి చేశారని, అయితే ఆ హత్యాయత్నం విఫలమైందని బుడనోవ్ పేర్కొన్నారని ఉక్రెయినిస్కా ప్రావ్దా అనే మీడియా సంస్థ వెల్లడించింది. అయితే ఈ ఘటన బయటి ప్రపంచానికి తెలియదని బుడనోవ్ చెప్పారు. తనపై ఐదుసార్లు హత్యాయత్నాలు జరిగినట్టు 2017లో స్వయంగా పుతినే ఓ సందర్భంగా వెల్లడించారు. వాటి గురించి ఆందోళన చెందట్లేదని అప్పట్లో పేర్కొన్నారు.
రష్యా ఆక్రమణ ప్రారంభమై 3 నెలలు
ఉక్రెయిన్పై రష్యా ఆక్రమణ ప్రారంభమై మంగళవారంతో మూడు నెలలు గడిచింది. కొద్ది రోజుల్లోనే పనిపూర్తి చేద్దామనుకున్న రష్యా వేసుకున్న అంచనాలు ఉక్రెయిన్ ప్రతిఘటనతో తప్పాయి. మరోవైపు మరియుపోల్లో శిథిలాల కింద 200 మృతదేహాలను గుర్తించినట్టు ఉక్రెయిన్ అధికారులు పేర్కొన్నారు. ఓ కూలిన అపార్ట్మెంట్ భవనం శిథిలాల కింద ఉన్న మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయని నగర మేయర్ సలహాదారు ఆండ్రియుష్చెంకో తెలిపారు. తూర్పు ఉక్రెయిన్ను డాన్బాస్ను పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు రష్యా దాడులను తీవ్రం చేసింది. పౌరులను హతమార్చడం, సాధ్యమైనంతగా తమ దేశా న్ని నాశనం చేసేందుకు రష్యా పూర్తిస్థాయి యుద్ధం చేస్తున్నదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు.
ఉక్రెయిన్ గెలిచేందుకు సహకరిస్తాం
ఉక్రెయిన్పై రష్యా దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నదని, ఈ యుద్ధంలో ఉక్రెయిన్ గెలిచేందుకు తాము చేయాల్సినదంతా చేస్తామని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్డెర్ లేయన్ పేర్కొన్నారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు-2022లో మంగళవారం ఆమె మాట్లాడుతూ యుద్ధంలో గెలుపు ఉక్రెయిన్ మనుగడ లేదా ఐరోపాకో సంబంధించింది కాదని, మొత్తం ప్రపంచానికి అవసరమని వ్యాఖ్యానించారు.