కీవ్: దక్షిణ ఉక్రెయిన్లో అణు విద్యుత్ కేంద్రానికి అతిసమీపంలో రష్యా క్షిపణి దాడిచేసింది. ఈ ప్లాంట్లోని మూడు రియాక్టర్లను దెబ్బతీయకుండా సమీపంలోని పారిశ్రామిక పరికరాలను క్షిపణి ఢీకొట్టింది. ఈ ఘటనతో ఉక్రెయిన్ ఉలిక్కిపడింది. దీన్ని ‘అణు ఉగ్రవాదం’గా పేర్కొంది. దాదాపు ఏడు నెలల యుద్ధం తర్వాత ఉక్రెయిన్లోని ఖార్కివ్ ప్రాంతంనుంచి రష్యా బలగాలను ఉక్రెయిన్ సైనికులు వెనక్కు తరమికొట్టారు.
ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ మౌలికసదుపాయాలపై తీవ్రమైన దాడులు చేస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన కొద్దిరోజులకే క్షిపణి దాడి జరుగడం ఉక్రెయిన్కు ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడు నెలల యుద్ధం దేశంలో రేడియాధార్మిక విపత్తుకు కారణమవుతుందేమోనన్న భయం నెలకొన్నది. పివ్డెన్నౌక్రైన్స్ అణు విద్యుత్ కేంద్రంలోని న్యూక్లియర్ రియాక్టర్లకు 300 మీటర్ల దూరంలో క్షిపణి దాడి జరగ్గా, అక్కడ రెండు మీటర్ల లోతు, 4 మీటర్ల వెడల్పులో గొయ్యి ఏర్పడిందని ఉక్రెయిన్ న్యూక్లియర్ ఆపరేటర్ ఎనర్గోటమ్ తెలిపింది.
రష్యన్లు మా దేశంలోకి రావొద్దు
ఉక్రెయిన్పై యుద్ధాన్ని సమర్థిస్తున్నందుకుగానూ రష్యా ప్రజలు తమ దేశాలకు రావొద్దని బాల్టిక్ దేశాలు నిషేధం విధించాయి. రష్యన్లు తమ దేశాల్లోకి రాకుండా సరిహద్దులు మూసేస్తున్నట్టు ఎస్టోనియా, లాత్వియా, లిథువేనియా సోమవారం ప్రకటించాయి.