ఉక్రెయిన్పై ఉరిమిన పుతిన్
క్షిపణులతో ముప్పేట దాడి
మమ్మల్ని అడ్డుకొంటే మీ చరిత్రలో చూడని వినాశనం తప్పదు
ప్రత్యర్థి దేశాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్రస్థాయి హెచ్చరిక
ఆయుధాలిస్తాం పోరాడండి: ప్రజలకు ఉక్రెయిన్ అధ్యక్షుడి పిలుపు
రష్యా దాడులను తిప్పికొట్టేందుకు శ్రమిస్తున్న ఉక్రెయిన్
దాడులు, ప్రతిదాడుల్లో ఇరువర్గాలకు భారీగా ప్రాణనష్టం
చేతులెత్తేసిన నాటో.. ఇప్పట్లో దళాలను పంపబోమని వెల్లడి
ఉక్రెయిన్లో చిక్కుకున్న 20 వేల మంది భారతీయ విద్యార్థులు
యుద్ధ భూమి నుంచి తరలించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి మొర
యుద్ధం మొదలైంది. గురువారం ఉదయం ఉక్రెయిన్ వాసులను రష్యా శతఘ్నులు నిద్రలేపాయి. ఉత్తరం.. పశ్చిమం.. అన్న తేడా లేకుండా పుతిన్ సైన్యం ఉక్రెయిన్పై ముప్పేట దాడికి తెగబడింది. అన్ని వైపులనుంచి ముప్పిరిగొన్న రష్యన్ సైన్యం బాంబింగ్తో బీభత్సాన్ని సృష్టించింది.
సైనిక స్థావరాలు, ఆయుధ కర్మాగారాలపై బాంబు దాడులతో మొదలైన యుద్ధం యావత్ ఉక్రెయిన్ను కమ్మేసింది. జనావాసాలపైనా విరుచుకుపడింది. 14 గంటల వ్యవధిలో మూడుసార్లు రష్యన్ బాంబర్లు భయానక విధ్వంసాన్ని సృష్టించాయి.
నాటో, అమెరికా, ఐరోపా దేశాలన్నీ మాటమాత్రపు ఖండనలతో.. రష్యాపై ఆంక్షల విధింపుతో చేతులు దులుపుకొన్నాయే కానీ.. ఒక్కటంటే ఒక్క దేశం అండగా నిలువకపోవడంతో ఉక్రెయిన్ ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరవుతున్నది.
ప్రజలు ఇండ్లల్లో ఉండలేక.. బయటకు పోలేక.. దేశం విడిచి పోయే పరిస్థితి లేక.. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని గడుపుతున్నారు. ఆ దేశంలో ఉన్న భారతీయులు, తెలంగాణ ప్రజలను, విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొని రావడానికి విదేశాంగశాఖ, తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా కృషిచేస్తున్నాయి.
కీవ్/మాస్కో, ఫిబ్రవరి 24: ఉక్రెయిన్పై రష్యా ఉక్కుపాదం మోపింది. తూర్పు ఉక్రెయిన్లోని డాన్బాస్ సైనిక స్థావరాలపైన మిలిటరీ ఆపరేషన్ చేపడుతున్నట్టు తొలుత ప్రకటించిన అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. మాటమార్చారు. యుద్ధ ట్యాంకులు, మిలిటరీ దాడులు, క్షిపణులతో యావత్తు ఉక్రెయిన్పై విరుచుకుపడ్డారు. ఇతర దేశాలు ఈ సైనిక చర్యను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే గతంలో ఎన్నడూ చూడని విధంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రష్యా దాడులు ఉద్ధృతమవ్వడంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్స్కీ దేశంలో ఎమర్జెన్సీ విధించారు. ‘ఆయుధాలిస్తాం, దేశం కోసం పోరాడాలం’టూ పౌరులకు పిలుపునిచ్చారు. రష్యా దాడుల్లో ఇప్పటివరకూ 40 మంది సైనికులు, పది మంది పౌరులు మరణించినట్టు ఉక్రెయిన్ ప్రకటించింది. 50 మందికి పైగా ఆక్రమణదారులను హతమార్చినట్టు వెల్లడించింది. ఉక్రెయిన్పై రష్యా దాడిని అమెరికా సహా పశ్చిమ దేశాలన్నీ తీవ్రంగా ఖండించాయి. పుతిన్ ఒక ప్రణాళిక ప్రకారమే యుద్ధాన్ని ఎంచుకొన్నారని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆరోపించారు. జరిగే ప్రాణ నష్టానికి రష్యాదే బాధ్యత అని హెచ్చరించారు. ఉక్రెయిన్లో 20 వేల మందికి పైగా భారతీయ విద్యార్థులు చిక్కుకొన్నట్టు సమాచారం. ఉద్రిక్తతల నేపథ్యంలో తమను భారత్కు తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకోవాలని భారతీయ విద్యార్థులు కేంద్ర ప్రభుత్వానికి మొర పెట్టుకుంటున్నారు.
అందుకే మిలిటరీ ఆపరేషన్: పుతిన్
అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్న ఖండనలను ఏ మాత్రం పట్టించుకోకుండా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్పై విరుచుకుపడ్డారు. తూర్పు ప్రాంతంలోని డాన్బాస్ ప్రాంతంపై సైనిక చర్య ప్రారంభించాలని రష్యా దళాలను గురువారం ఉదయం ఆదేశించారు. ఆయుధ కేంద్రాలు, వసతులు, సైనిక, వైమానిక స్థావరాలను ధ్వంసం చేయాలని సూచించారు. ఉక్రెయిన్ను ఆక్రమించుకోవడం తమ ఉద్దేశం కాదని.. తూర్పు ఉక్రెయిన్లోని పౌరులను కాపాడుకోవడానికే ఈ సైనిక చర్య చేపడుతున్నట్టు వెల్లడించారు. రష్యా ఆత్మరక్షణ కోసమే ఈ ఆపరేషన్ ప్రారంభించినట్టు చెప్పుకొచ్చారు. ఇతర దేశాలు ఈ సైనిక చర్యను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఉక్రెయిన్ సైనికులు ఆయుధాలు పడేసి లొంగిపోవాలని డిమాండ్ చేశారు.
పౌరుల బెంబేలు
రష్యా ముప్పేట దాడితో రాజధాని కీవ్లో ఎయిర్ రెయిడ్ సైరన్లు గురువారం నిరంతరాయంగా మోగుతూనే ఉన్నాయి. నగరంపైకి క్షిపణులు దూసుకొచ్చే సందర్భాల్లో అప్రమత్తం చేసేందుకు ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఇవి మోగుతాయి. ఈ సైరన్ల శబ్దాలు వినబడగానే ప్రజలు అండర్గ్రౌండ్ స్టేషన్లు, ఇతర సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. నగరాన్ని విడిచిపెట్టి వెళ్లేందుకు కార్లు, సొంత వాహనాల్లో ఒక్కసారిగా బయల్దేరడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. నిత్యావసరాల కోసం ప్రజలు దుకాణాల ముందు బారులు తీరారు. ఏటీఎం, పెట్రోల్ బంకుల ముందు భారీగా క్యూలు కనిపించాయి. ఆక్రమణదారుల కాల్పులు, క్షిపణుల దాడులతో ప్రధాన నగరాలను మంటలు, దట్టమైన పొగ ఆవరించింది. భయభ్రాంతులకు గురైన ప్రజలు పరుగులు తీయడం కనిపించింది.
ఆయుధాలిస్తాం.. కదలండి: జెలెన్స్కీ
రష్యా సైనిక చర్యను ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్స్కీ తీవ్రంగా ఖండించారు. రష్యాతో దౌత్యపరమైన సంబంధాలను తెంచుకొంటున్నట్టు ప్రకటించారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశంలో అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్టు ప్రకటించారు. రష్యా దాడుల నుంచి దేశాన్ని ఎలాగైనా కాపాడుకొంటానన్నారు. దాడుల తీవ్రత పెరుగడంతో.. ‘ఆయుధాలిస్తాం, దేశం కోసం పోరాడండి’ అని పౌరులకు పిలుపునిచ్చారు.
మోదీ చెబితే పుతిన్ వినొచ్చు
సంక్షోభ సమయంలో భారత్ తమ దేశానికి అండగా నిలబడాలని భారత్లో ఉక్రెయిన్ రాయబారి ఇగోర్ పొలిఖా కోరారు. రష్యాతో భారత్కు సత్సంబంధాలు ఉండవచ్చేమో గానీ.. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తమకు అండగా నిలబడాలన్నారు. రష్యా-ఉక్రెయిన్ విషయంలో ప్రధాని నరేంద్రమోదీ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మోదీ చెబితే పుతిన్ వింటారని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఆక్రమించుకోబోం అంటూనే..
ఉక్రెయిన్ను ఆక్రమించుకోవడం తమ ఉద్దేశం కాదని ప్రకటించిన పుతిన్.. అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. అధ్యక్షుడి ప్రకటన వెలువడిన అనంతరం తూర్పు ప్రాంతంలోని డాన్బాస్లోని ఆయుధ కేంద్రాలు, సైనిక, వైమానిక స్థావరాలు, వసతులపై బాంబుల వర్షం కురిపించిన రష్యా సేనలు అంతటితో ఆగకుండా రాజధాని కీవ్ నగరాన్ని కూడా చుట్టుముట్టాయి. కొన్ని గంటల్లోనే మెరియోపోల్, లుహాన్స్క్, షాష్ట్యా, క్రమెటోస్క్, నిప్రో, సెన్కివ్కా, వీవ్, ఇవాన్ ఫ్రాంక్ఇవ్స్క్ వంటి కీలక ప్రాంతాల్లోని నేవీ, మిలిటరీ, వైమానిక స్థావరాలు, పవర్ స్టేషన్లు, న్యూక్లియర్ పవర్ స్టేషన్లపై క్షిపణులు, యుద్ధ ట్యాంకుల దాడులు జరిగాయి. పారాట్రూపర్ల సాయంతో రష్యా సేనలు కీలక ప్రాంతాలకు చేరుకొన్నట్టు స్థానిక మీడియా వెల్లడించింది. యుద్ధం ప్రారంభించేకంటే ముందు ఉక్రెయిన్ రక్షణ, హోం శాఖల సర్వర్లపై రష్యా సైబర్ దాడులకు పాల్పడినట్టు తెలుస్తున్నది. గురువారం రష్యా చేపట్టిన దాడుల్లో 40 మందికిపైగా ఉక్రెయిన్ సైనికులు, 18 మంది పౌరులు మృతి చెందినట్టు ఉక్రెయిన్ వర్గాలు తెలిపాయి. 50 మంది రష్యా ఆక్రమణదారులను హతమార్చినట్టు, పదికి పైగా రష్యా విమానాలను కూల్చేసినట్టు వెల్లడించాయి. 14 మందితో ప్రయాణిస్తున్న ఉక్రెయిన్ మిలిటరీ విమానం కీవ్ సమీపంలో కూలిపోయింది. వీరిలో ఐదుగురు మరణించారు. ఉక్రెయిన్లోని 11 ఎయిర్ఫీల్డ్లతో సహా 70కి పైగా స్థావరాలు ధ్వంసమయ్యాయి.