వార్సా: పోలాండ్లోని రష్యా అంబాసిడర్ సెర్గీ ఆండ్రియేవ్పై ఇవాళ దాడి జరిగింది. వార్సాలో పుష్పగుచ్ఛ నివాళి సమయంలో ఆందోళనకారులు అతనిపై ఎర్ర రంగు చల్లారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో మృతిచెందిన రెడ్ ఆర్మీ సైనికులకు నివాళి అర్పిస్తున్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకున్నది. ఉక్రెయిన్ జెండాలతో ఉన్న నిరసనకారులు ఆండ్రియేవ్పై ఈ దాడి చేశారు. ఇవాళ రష్యా విక్టరీ డే సెలబ్రేట్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. పుష్ప నివాళి ఈవెంట్ను రద్దు చేయాలని ఇటీవల పోలాండ్ అధికారులు రష్యాను కోరారు. వాస్తవానికి పోలాండ్ అన్ని అధికారిక కార్యక్రమాలను రద్దు చేశారు. కానీ, సైనిక శ్మశానవాటికకు ఆండ్రియేవ్ విజిట్ను కొనసాగించారు. నిరసనకారుల దాడిలో తనకు ఎటువంటి గాయాలు కాలేదని సెర్గీ తెలిపారు.