మాస్కో: దేశ మనుగడకు ప్రమాదం వస్తేనే అణ్వాయుధాలు వాడుతామని రష్యా చెప్పింది. ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో అణ్వాయుధం వాడాల్సిన అవసరం లేదని రష్యా అధ్యక్ష కార్యాలయ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తెలిపారు. ఉక్రెయిన్తో పోరులో ఎటువంటి పరిస్థితి ఎదురైనా, అది అణ్వాయుధ వినియోగానికి కారణం కాదు అని ఆయన క్లారిటీ ఇచ్చారు. తమకు భద్రతాపరమైన అంశాలు స్పష్టంగా ఉన్నాయని, దేశానికి ఏదైనా ప్రమాదం ఉంటే, అప్పుడు తాము ఆ అణ్వాయుధాలను వాడుతామని, కేవలం దేశానికి ప్రమాదం ఉందని తెలిస్తేనే ఆ ఆయుధాలను వాడనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
పుతిన్ కసాయి అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యల పట్ల కూడా రష్యా స్పందించింది. అయితే పుతిన్పై బైడెన్ చేసిన వ్యాఖ్యలు ఆందోళనకరంగా ఉన్నట్లు పెస్కోవ్ తెలిపారు. పుతిన్ ఇక అధికారంలో ఉండవద్దు అని బైడెన్ చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతం ఉన్నట్లు ఆయన అన్నారు. ఆ వ్యాఖ్యలు ఆమోదయోగ్యంగా లేవన్నారు. రష్యా అధ్యక్షుడిగా ఎవరు ఉండాలని అమెరికా అధ్యక్షుడు నిర్ణయించలేరని, ప్రజలే ఆ బాధ్యత తీసుకుంటారన్నారు.
ఉక్రెయిన్లో తమ దళాలు ఇండ్లపై కానీ అపార్ట్మెంట్లపై కానీ పౌర కేంద్రాలపై కానీ ఫైరింగ్ జరపడం లేదన్నారు. కేవలం సైనిక కేంద్రాలను మాత్రమే తమ బలగాలు టార్గెట్ చేస్తున్నట్లు పెస్కోవ్ చెప్పారు.