Russia Ukraine War | ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. జపోరిజియా నగరంపై రష్యా శనివారం భీకరదాడులకు పాల్పడింది. క్షిపణితో దాడి చేయగా.. కనీసం 12 మంది మృతి చెందారని ఉక్రెయిన్ అధికారులు ఆదివారం తెలిపారు. జపోరిజియా ప్రాంతంలోని రష్యా జరిపిన దాడుల్లో ఎత్తయిన నివాసం భవనం కూలిపోయింది, పలు భవనాలు దెబ్బతిన్నాయని ఉక్రేనియన్ వైమానిక దళం తెలిపింది.
దాడిలో కనీసం 17 మంది మృతి చెందారని తెలిపిన సిటీ కౌన్సిల్ ఆ తర్వాత.. 12 మంది మాత్రమే ప్రాణాలు విడిచినట్లు పేర్కొంది. ఘటనలో చాలా మంది గాయపడ్డారని, ఇందులో పది మంది వరకు పిల్లలు ఉన్నారని చెప్పింది. దాడి ఘటనలో కనీసం 20 ప్రైవేట్ ఇళ్లు, 50 అపార్ట్మెంట్ భవనాలు దెబ్బతిన్నాయని, కనీసం 40 మంది ఆసుపత్రి పాలయ్యారని సిటీ కౌన్సిల్ సెక్రెటరీ అనటోలీ కుర్తేవ్ తెలిపారు.
మరో వైపు రష్యా-క్రిమియాను కలిపే కెర్చ్ రోడ్డు, రైలు వంతెనపై శనివారం ఉదయం పేలుడు చోటు చేసుకున్నది. ఈ దాడిలో ముగ్గురు మరణించారు. అయితే, ఈ ఘటనపై రష్యా అధ్యక్షుడు పుతిన్ విచారణకు ఆదేశించారు. పేలుడుకు కారణమైన ట్రక్ యజమాని దక్షిణ రష్యాలోని క్రాస్నాడర్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. శనివారం రైలు, వాహనాల రాకపోకలను నిలిపివేసిన అధికారులు.. తిరిగి ఆదివారం పునరుద్ధరించారు.