మాస్కో : బాల్టిక్ సముద్రం కింద నుంచి జర్మనీకి వెళ్లే నార్డ్ స్ట్రీమ్ 2 పైప్లైన్ లింక్ ద్వారా యూరప్కు గ్యాస్ సరఫరాను పునరుద్ధరించేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం తెలిపారు. మాస్కో ఎనర్జీ ఫోరమ్లో మాట్లాడుతూ నార్డ్ స్ట్రీమ్-1 పైప్లైన్ రెండు లింక్లు, నార్డ్ స్ట్రీమ్-2 పైప్లైన్ రెండు లింకుల్లో భారీ గ్యాస్ లీక్కు కారణమైన పేలుళ్ల వెనుక అమెరికా హస్తం ఉందని పుతిన్ మరోసారి ఆరోపించారు. అయితే, రష్యా అధ్యక్షుడు చేసిన ఆరోపణలను అమెరికా గతంలో ఖండించింది. ఉక్రెయిన్పై యుద్ధం నేపథ్యంలో యూరోపియన్ దేశాలకు రష్యా గ్యాస్ సరఫరాను తగ్గించింది.
ఇదిలా ఉండగా.. ఐఏఈఏ చీఫ్ రాఫెల్ గ్రాస్సీ రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీ అయ్యారు. భేటీలో జపోరిజ్జియా అణువిద్యుత్ ప్లాంట్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో పుతిన్తో ఐఏఈఏ డైరెక్టర్ మధ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అణు ప్రమాదాన్ని నివారణపై చర్చించారు. అణు ప్రమాదం జరిగే ఆయా ప్రాంతాల్లో చాలా నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. ఆ తర్వాత భేటీకి సంబంధించి క్రెమ్లిన్ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుత కాలంలో ఇంధన సమస్యలు, గ్లోబల్ వార్మింగ్, అనేక అంశాలు అణుశక్తికి సంబంధించి వర్తమానం, భవిష్యత్లో అణుశక్తి పాత్ర ఎలా ఉండవచ్చనే విషయాన్ని గ్రాస్సీ హైలెట్ చేశారని, రష్యా ఎల్లప్పుడూ ఏజెన్సీకి మద్దతు ఇస్తుందని క్రెమ్లిన్ పేర్కొంది.