మాస్కో: ఉక్రెయిన్లోని మరియపోల్లో కొన్ని నెలల పాటు సాగిన యుద్ధం ముగిసినట్లు రష్యా ప్రకటించింది. అజోవ్ స్టీల్ ప్లాంట్ కూడా విముక్తి అయినట్లు వెల్లడించింది. అజోవ్ ప్లాంట్కు రక్షణగా ఉన్న సైనికులు పూర్తిగా లొంగిపోయినట్లు రష్యా అధికారులు తెలిపారు. భారీ పరిశ్రమ అయిన అజోవ్ ప్లాంట్లో నెలల పాటు ఉక్రెయిన్ దళాలు తలదాచుకున్నాయి. ఆ ప్లాంట్పై రష్యా ఆధిపత్యాన్ని ఆ దళాలు అడ్డుకున్నాయి. అయితే శుక్రవారం ఆ ప్లాంట్ నుంచి చివరి దళాన్ని బయటకు పంపారు. మరియపోల్ నగరంతో పాటు అజోవ్ స్టీల్ ప్లాంట్ పూర్తిగా విముక్తి అయినట్లు రష్యా రక్షణశాఖ కార్యాలయం పేర్కొన్నది. ప్లాంట్లో మిలిటెంట్లు దాచుకున్న ప్రాంతాన్ని పూర్తిగా ఆధీనంలోకి తెచ్చినట్లు రష్యా దళాలు తెలిపాయి. 2400 మంది ఇప్పటి వరకు లొంగిపోయినట్లు రష్యా చెప్పింది. 531 మంది ఉన్న చివరి గ్రూపు శుక్రవారం లొంగిపోయినట్లు రష్యా సైనిక ప్రతినిధి మేజర్ జనరల్ ఇగర్ కొనషెంకోవ్ తెలిపారు.