స్వీడన్, డెన్మార్క్ తీరాల్లో నార్డ్ స్ట్రీమ్ పైప్లైన్కు లీకులు ఏర్పడి, దానిలోని గ్యాస్ సముద్రం పాలవుతోంది. యూరప్లో గ్యాస్ లభించక ప్రజలు అవస్థలు పడుతున్న ఈ తరుణంలో ఇలా జరగడంతో అక్కడి ప్రజలు మరింత ఇబ్బంది పడుతున్నారు. ఇలా పైప్లైన్కు నష్టం ఎందుకు జరిగిందో తెలుసుకునే ప్రయత్నం పాశ్చాత్య దేశాలు ఏమాత్రం చేయడం లేదు.
రష్యా కాకుండా వేరే ప్రాంతం నుంచి తమ అవసరాలకు గ్యాస్, చమురు తెచ్చుకునేందుకు ఈ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఏదో ప్రమాదం జరిగి గ్యాస్ పైప్లైన్ దెబ్బతిందని మాత్రమే ఈ దేశాలు ప్రకటించాయి. అయితే గ్యాస్ పైప్లైన్ను పాశ్చాత్య దేశాలే కావాలని దెబ్బతీశాయని, మిసైల్ దాడులు చేసి గ్యాస్ను బాల్టిక్ సముద్రం పాలు చేస్తున్నాయని రష్యా ఆరోపించింది.
రష్యా ఫారెన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ డైరెక్టర్ సెర్గీ నారీష్కిన్ ఇదే విషయంపై మాట్లాడుతూ.. పశ్చిమ దేశాలపై మండిపడ్డారు. బాలిస్టిక్ సముద్రంలో ఉన్న నార్డ్ స్ట్రీమ్ పైప్లైన్పై దాడులు చేసిన యూరప్ దేశాలు.. కావాలనే దీన్ని ధ్వంసం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.
ఈ పైప్లైన్స్లో ఇంకా గ్యాస్ ఉండటంతో అది మొత్తం సముద్రం పాలవుతోందని చెప్పారు. దీనిపై అంతర్జాతీయ దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. అసలు పైప్లైన్పై ఎవరో దాడి చేశారని ఇప్పుడే చెప్పలేమని అమెరికా అంటోంది. అయితే తమ సముద్ర తీరాల్లో భారీ పేలుళ్లు గమనించినట్లు స్వీడన్, డెన్మార్క్ శాస్త్రవేత్తలు చెప్పడం గమనార్హం.