మాస్కో, ఏప్రిల్ 22 : దౌత్య సిబ్బందిపై సామూహిక బహిష్కరణల వేటుతో రష్యా, జర్మనీ మధ్య సంబంధాలు రోజురోజుకు మరింత దిగజారుతున్నాయి. కొద్ది రోజుల క్రితం బెర్లిన్ నుంచి రష్యా దౌత్యవేత్తలను, ఇతర సిబ్బందిని జర్మనీ బహిష్కరించగా, ఇప్పుడు రష్యా తన వంతుగా ప్రతీకార చర్యలకు దిగింది.
మాస్కోలోని జర్మనీ దౌత్య కార్యాలయంలో పనిచేస్తున్న 20 మందికిపైగా దౌత్యవేత్తలపై బహిష్కరణ వేటు విధిస్తున్నట్టు శనివారం ప్రకటించింది. ఈమేరకు రష్యా విదేశాంగ అధికార ప్రతినిధి మారియా జక్రోవా మీడియాకు వెల్లడించారు. ఎంతమంది రష్యా దౌత్యవేత్తలపై జర్మనీ వేటు వేసిందో, అంతే సంఖ్యలో రష్యా కూడా జర్మనీ దౌత్యసిబ్బందిని దేశం నుంచి బహిష్కరించబోతున్నదని ప్రభుత్వ న్యూస్ ఏజెన్సీ ఆర్ఐఏ నోవాస్ట్సీ శనివారం తెలిపింది.