న్యూఢిల్లీ, మే 25: సీబీఐ కొత్త డైరెక్టర్గా సుబోధ్ కుమార్ జైస్వాల్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేండ్ల కాలానికి ఆయనను నియమిస్తున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మహారాష్ట్ర క్యాడర్, 1985 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన జైస్వాల్ ప్రస్తుతం సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. గతంలో మహారాష్ట్ర డీజీపీగా పనిచేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరితో కూడిన సీబీఐ డెరెక్టర్ ఎంపిక కమిటీ సోమవారం సమావేశమై చర్చించిన సంగతి తెలిసిందే. జైస్వాల్తో పాటు సీనియర్ ఐపీఎస్ అధికారులు వీఎస్కే కౌముది, కేఆర్ చంద్ర పేర్లు కూడా తుది పరిశీలనకు ఎంపికయ్యాయి. వారిలో జైస్వాల్ను ఎంపిక చేశారు. కాగా సీబీఐ డైరెక్టర్గా రెండేండ్ల పాటు పనిచేసిన రిషి కుమార్ శుక్లా ఫిబ్రవరి 3న పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి మూడు నెలలుగా సీబీఐకి పూర్తిస్థాయి డైరెక్టర్ లేరు. అదనపు డైరెక్టర్ ప్రవీణ్ సిన్హా తాత్కాలిక డైరెక్టర్గా కొనసాగుతున్నారు.
సీబీఐ కొత్త డైరెక్టర్ నియామకంలో జాప్యంపై కామన్ కాజ్ అనే స్వచ్ఛంద సంస్థ కొన్నాళ్ల కిందట సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో జైస్వాల్ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది. సీబీఐ డైరెక్టర్ పదవిలో ఇన్చార్జి అధికారులను నియమించి నెట్టుకురావడం కుదరదని విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఢిల్లీ పోలీస్ స్పెషల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం సెక్షన్ 4ఏ ప్రకారం పూర్తిస్థాయి సీబీఐ డైరెక్టర్ను నియమించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని పిటిషనర్ పేర్కొన్నారు. పోస్టు ఖాళీ అవడానికి రెండు నెలలు ముందుగానే సీబీఐ డైరెక్టర్ను ఎంపిక చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరారు.