రష్యా- ఉక్రెయిన్ మధ్య పరిస్థితులు మరింత క్షీణించిన నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ ఉక్రెయిన్లో నివసిస్తున్న భారతీయులకు మరో మారు కీలక సూచన చేసింది. వీలైనంత త్వరగా ఉక్రెయిన్ నుంచి భారత్కు తిరిగి రావాలని తాజాగా కీలక సూచన చేసింది. ఆన్లైన్ క్లాసుల సమాచారం కోసం అక్కడే వేచి చూడకుండా… వెంటనే ఉక్రెయిన్ను వీడాలని విజ్ఞప్తి చేసింది. ‘ఈ విషయంలో తాము ఆయా యూనివర్శిటీ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే వున్నాం. ఆన్లైన్ క్లాసుల సమాచారం కోసం అక్కడే ఆగిపోకండి. వీలైనంత త్వరగా భారత్కు వచ్చేయండి. ఆన్లైన్ క్లాసుల విషయమై భారత రాయబార కార్యాలయానికి ఒక్కటే ఫోన్లు వస్తున్నాయి. వారి వారి భద్రత దృష్ట్యా… ఉక్రెయిన్ను వెంటనే వీడాలని మేం సూచిస్తున్నాం’ అంటూ భారత రాయబార కార్యాలయం సూచించింది.
ఉక్రెయిన్లో ఉన్న భారత రాయబార కార్యాలయం ఇలా సూచించడం ఇది మూడోసారి. అత్యవసరమైతే తప్ప.. ఉక్రెయిన్లో ఉండొద్దని మొదట్లో సూచించిన భారత ఎంబసీ… తాజాగా… ఉక్రెయిన్ను త్వరగా వీడాలంటూ హెచ్చరికలు జారీ చేసింది.
భారతీయుల తరలింపు కోసం బయల్దేరిన ప్రత్యేక విమానం
ఉక్రెయిన్లోని భారతీయులను, ఎంబసీ సిబ్బందిని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నాలను ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా మూడు రోజుల పాటు ప్రత్యేక విమానాల్లో భారతీయులను తరలించనుంది. మంగళవారం ఉదయం ఎయిరిండియా ప్రత్యేక విమానం డ్రిమ్లైనర్ బీ -787 ఉక్రెయిన్కు బయల్దేరింది. ఈ రోజు రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ విమానం ఢిల్లీకి తిరిగి రానుంది.