లండన్, డిసెంబర్ 11: ఐస్క్రీం చల్లగా.. నిప్పులు వేడిగా ఉంటాయి. ఇది సహజం. కానీ, ‘ఐస్క్రీం చల్లారింది.. డబ్బులు వాపస్ ఇవ్వండి’ అంటూ ఓ వినియోగదారుడి ఫిర్యాదుతో రెస్టారెంట్ యజమాని అవాక్కయ్యాడు. ఇలాంటి హాస్యాస్పద ఫిర్యాదులతో కొందరు మోసగిస్తున్నారని వాపోయాడు. యూకేలోని ఓల్ధం పట్టణంలో హసన్ హబీబ్ లక్కీస్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. ఒకరు.. నాలుగు మిల్క్షేక్లు, ఒక చీజ్కేక్, ఐస్క్రీం కావాలని ఆర్డర్ పెట్టారని, ఆహారం చల్లగా ఉన్నందున తమ డబ్బులు వాపస్ ఇవ్వాలని 45 నిమిషాల తర్వాత రిక్వెస్ట్ పెట్టారని హబీబ్ తెలిపారు. తిన్న తర్వాత వింత, పనికిరాని కారణాలతో డబ్బులు వాపస్ చేయాలనే కొత్త స్కామ్ జస్ట్ ఈట్లో మొదలైందని పేర్కొన్నారు. ఫుడ్ ఆర్డర్ చేస్తారు.. ఎక్స్, వై, జడ్ సాకులు చూపి డబ్బులు వాపస్ ఇవ్వాలనే ఫిర్యాదుల సంఖ్య ఇటీవల పెరిగిందని తెలిపారు. దీంతో తాను టేక్ అవే (పార్సిల్) సేవలను నిలిపివేయాల్సి వచ్చిందని వెల్లడించారు. ఇలాంటి ఫిర్యాదుల కారణంగా ‘జస్ట్ఈట్’లో కొత్త పాలసీలు తీసుకొచ్చారు. ఫిర్యాదుకు కూడా కొంత చార్జీ వసూలు చేసి.. 30 రోజుల గడువులో ఫిర్యాదు వాస్తవమని తేలితేనే డబ్బులు వాపస్ ఇస్తున్నారు.