ఇస్లామాబాద్ : ఆర్ధిక, ఆహార సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్ ఇంధన ధరలు భగ్గుమంటాయనే వార్తలతో ఉలిక్కిపడింది. ఈ వార్తలతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పెట్రోల్ పంపుల ఎదుట ప్రజలు క్యూ కడుతున్నారు. పెట్రోల్ షాపుల ఎదుట పొడవాటి క్యూలు దర్శనమిస్తున్నాయని డాన్ పత్రిక పేర్కొంది. ఫిబ్రవరి 1న పెట్రోల్, డీజిల్ ధరలు ఏకంగా రూ. 45 నుంచి రూ. 80 వరకూ భారమవుతాయని సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమనగా ప్రజలు పెట్రోల్ దుకాణాల వద్ద బారులుతీరారు.
అమెరికా డాలర్తో పాకిస్తాన్ కరెన్సీ శనివారం భారీగా పతనమవడంతో పెట్రో ఉత్పత్తుల ధరలు భగ్గుమంటాయనే ప్రచారం ఊపందుకుంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు అడుగంటడంతో పాకిస్తాన్ కేవలం మూడు వారాలకు సరిపడా దిగుమతులకు మాత్రమే చెల్లింపులు జరిపే వెసులుబాటు ఉంది. సంక్షోభం అధిగమించేందుకు ఐఎంఎఫ్ విడుదల చేసే తదుపరి 100 కోట్ల డాలర్ల బెయిల్ అవుట్ ప్రోగ్రాం కోసం పాకిస్తాన్ వేచిచూస్తోంది. గుజ్రన్వాలాలో కేవలం 20 శాతం పెట్రోల్ బంకుల్లోనే పెట్రోల్ అందుబాటులో ఉందని జియో న్యూస్ పేర్కొంది.
రహీం యార్ ఖాన్, బహవల్పూర్, సియాల్కోట్, ఫైసలాబాద్ వంటి ప్రాంతాల్లో పెట్రోల్ కొరత తీవ్రంగా ఉంది. ఇంధన ధరల పెంపు వార్తలను ప్రభుత్వం తోసిపుచ్చింది. రాబోయే రెండు వారాలకు సంబంధించి ధరల సవరణను పాకిస్తాన్ ఆయిల్ అండ్ గ్యాస్ అథారిటీ ఇంకా చేపట్టలేదని పేర్కొంది. కరెన్సీ పతనం, అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరల ప్రభావం ఫిబ్రవరి 15 నుంచి పాక్లో పెట్రో ధరలపై ప్రభావం చూపుతాయని తెలిపింది. మరోవైపు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకూ ఐఎంఎఫ్ ప్రతినిధి బృందం పాకిస్తాన్లో పర్యటించనుండగా నిధుల ప్రవాహం ప్రారంభమవుతుందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆశాభావం వ్యక్తం చేశారు.