దోహా/ న్యూఢిల్లీ: భారత మాజీ నేవీ అధికారులకు ఊరట లభించింది. 8 మందికి విధించిన మరణ శిక్షను ఖతార్ కోర్టు తగ్గించింది. జైలు శిక్షగా మార్పు చేస్తూ తీర్పు ఇచ్చింది. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) గురువారం ఈ విషయాన్ని తెలిపింది. అయితే అపీల్కు సంబంధించి ఖతార్ కోర్టు ఇచ్చిన తీర్పు పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొంది. భారతీయ మాజీ నేవీ అధికారులకు రాయబార సంప్రదింపులతోపాటు చట్టపరమైన సహాయాన్ని కొనసాగిస్తామని వెల్లడించింది.
కాగా, ఖతార్లోని ప్రైవేట్ సంస్థలో పనిచేసిన భారతీయ నేవీ మాజీ కమాండర్లు పూర్ణేందు తివారీ, సుగుణాకర్ పాకాల, అమిత్ నాగ్పాల్, సంజీవ్ గుప్తా, మాజీ నేవీ కెప్టెన్లు నవతేజ్ సింగ్ గిల్, బీరేంద్ర కుమార్ వర్మ, సౌరభ్ వశిష్ట్, మాజీ సెయిలర్ రాగేశ్ గోపకుమార్ను 2022లో అరెస్ట్ చేశారు. ఇజ్రాయెల్ తరుఫున గూఢచర్యం చేస్తున్నట్లు అభియోగాలు మోపడంతో ఖతార్ కోర్టు ఈ ఏడాది అక్టోబర్లో వారికి మరణశిక్ష విధించింది.
మరోవైపు భారత ప్రభుత్వం దీనిపై స్పందించింది. ఖతార్ ప్రభుత్వ యంత్రాంగంతో సంప్రదింపులు జరిపింది. భారతీయ మాజీ నేవీ అధికారులకు దౌత్య సంప్రదింపులతోపాటు చట్టపరమైన సహాయాన్ని అందించింది.అలాగే ఇటీవల దుబాయ్లో జరిగిన కాప్28 శిఖరాగ్ర సమావేశంలో ఖతార్ పాలకుడు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీని ప్రధాని మోదీ కలిశారు. ఈ అంశంపై మాట్లాడారు. ఈ నేపథ్యంలో భారత మాజీ నేవీ అధికారులకు విధించిన మరణ శిక్ష అపీల్పై ఖతార్ కోర్టు విచారణ జరిపింది. మరణ శిక్షను తగ్గించి జైలు శిక్షగా మార్పు చేసింది.