పారిస్: ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది 488 మంది జర్నలిస్టులను అరెస్టు చేశారు. సుమారు 46 మందిని హతమార్చినట్లు రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్(ఆర్ఎస్ఎఫ్) ఎన్జీవో సంస్థ వెల్లడించింది. గడిచిన 25 ఏళ్ల నుంచి జర్నలిస్టుల డేటాను ఆర్ఎస్ఎఫ్ లెక్కిస్తోంది. అయితే 2021లో జర్నలిస్టుల మరణాల సంఖ్య తగ్గినట్లు ఆ సంస్థ అభిప్రాయపడింది. మిడిల్ ఈస్ట్లో వివాదాలు సద్దుమణగడం వల్ల మరణాల సంఖ్య తగ్గినట్లు భావిస్తున్నారు. కానీ జర్నలిస్టుల అరెస్టులు మాత్రం భారీగా పెరిగాయి. గతంలో ఎప్పుడూ ఇంత భారీ స్థాయిలో అరెస్టుల జరగలేదని తన రిపోర్ట్లో ఆర్ఎస్ఎఫ్ చెప్పింది. గత ఏడాదితో పోలిస్తే, అరెస్టులు 20 శాతం పెరిగాయి. మయన్మార్, బెలారస్, హాంగ్ కాంగ్ లాంటి దేశాల్లో అణిచివేతలు ఎక్కువ కావడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఈసారి మహిళా జర్నలిస్టులను అరెస్టు చేసిన సంఖ్య కూడా పెరిగింది. సుమారు 60 మంది మహిళా జర్నలిస్టులు ఈ ఏడాది అరెస్టు అయ్యారు.
ఈ ఏడాది అత్యధికంగా చైనాలో 127 మంది జర్నలిస్టులను అరెస్టు చేశారు. మయన్మార్లో 53, వియత్నాంలో 43, సౌదీ అరేబియాలో 31 మంది జర్నలిస్టులను అదుపులోకి తీసుకున్నారు. ఇక సిరియా, ఇరాక్, యెమెన్ దేశాల్లో యుద్ధ వాతావరణం తగ్గడం వల్ల జర్నలిస్టుల మరణాల సంఖ్య తగ్గినట్లు భావిస్తున్నారు. మెక్సికోలో ఏడు, ఆఫ్ఘనిస్తాన్లో ఆరు మంది జర్నలిస్టులను చంపేశారు. యెమెన్, ఇండియాలో నలుగురేసి జర్నలిస్టులు హత్యకు గురయ్యారు.