బుదాపెస్ట్: హంగేరి ప్రధానిగా విక్టర్ ఓర్బన్ మళ్లీ గెలిచారు. నాలుగోసారి ఆయన విజయం సాధించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఫిడ్జ్ పార్టీ 53 శాతం ఓట్లతో గెలిచినట్లు ప్రాథమిక్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓర్బన్ విక్టరీ సందేశం ఇచ్చారు. ఆ ప్రసంగంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ఆయన తప్పుపట్టారు. జెలెన్స్కీ, బ్రస్సెల్స్ నేతలు తమకు ప్రత్యర్థులు అని ఆయన ఆరోపించారు. వాస్తవానికి ఉక్రెయిన్ బోర్డర్ దేశం హంగేరి. ఉక్రెయిన్ నుంచి వలస వస్తున్న వారికి హంగేరి ఆశ్రయం కల్పిస్తోంది. కానీ ఉక్రెయిన్కు ఆయుధాలను సరఫరా చేసేందుకు మాత్రం హంగేరి నిరాకరిస్తోంది. ఈ నేపథ్యంలో ఓర్బన్ వైఖరిని పలుమార్లు జెలెన్స్కీ విమర్శించారు. నాటో దళాపతులు, అంతర్జాతీయ మీడియా, ఉక్రెయిన్ అధ్యక్షుడు తమకు ప్రత్యర్థులుగా నిలిచారని ఓర్బన్ తన ప్రసంగంలో అన్నారు.