లండన్: ఏడుగురు నవజాత శిశులను చంపిన నర్సును భారత సంతతి డాక్టర్ పోలీసులకు పట్టిచ్చారు. విచారణ జరిపిన కోర్టు చివరకు ఆమెను దోషిగా నిర్ధారించి జైలు శిక్ష విధించింది. బ్రిటన్లోని చెస్టర్లో ఈ సంఘటన జరిగింది. భారత సంతతి వైద్యుడు డాక్టర్ రవి జయరామ్ (Ravi Jayaram) ఉత్తర ఇంగ్లాండ్లోని కౌంటెస్ ఆఫ్ చెస్టర్ హాస్పిటల్లో వైద్యుడిగా పని చేస్తున్నారు. ఆయన శిశు వైద్య నిఫుణుడు. 2015 జూన్లో ఆ హాస్పిటల్లో ముగ్గురు నవజాత శిశివులు చనిపోయారు. ఆయనతోసహా పలువురు డాక్టర్లు దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తర్వాత కూడా మరో నలుగురు నవజాత శిశువులు మరణించడంపై వారు కలతచెందారు.
కాగా, 2015 జూన్ నుంచి ఏడాది కాలంలో ఏడుగురు నవజాత శిశువులు చనిపోవడంపై డాక్టర్ రవి జయరామ్, ఆ హాస్పిటల్కు చెందిన మరి కొంతమంది డాక్టర్లు, నర్సు లూసీ లెట్బీపై అనుమానం వ్యక్తం చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న శిశువులను ఆమె చంపుతున్నదని ఆరోపించారు. హాస్పిటల్ యాజమాన్యంతోపాటు నేషనల్ హెల్త్ సర్వీసెస్ (ఎస్హెచ్ఎస్) దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో 2017 ఏప్రిల్లో పోలీస్ అధికారిని ఆ డాక్టర్లు కలిసేందుకు ఎస్హెచ్ఎస్ ట్రస్ట్ అనుమతి ఇచ్చింది.
మరోవైపు డాక్టర్లు చెప్పింది విన్న పోలీస్ అధికారి షాకయ్యారు. ఇది చాలా సీరియస్ కేసు అని పది నిమిషాల్లో ఆయన గ్రహించారు. అనంతరం నర్సు లూసీ లెట్బీపై దర్యాప్తు జరిపారు. 2018 జూలైలో ఆమెను అరెస్ట్ చేశారు. 2020లో ఆ నర్సుపై అభియోగాలు నమోదు చేశారు. ఏడుగురు నవజాత శిశువులను హత్య చేసిన లూసీ లెట్బీ, మరో ఆరుగురు శిశువులను చంపడానికి ప్రయత్నించినట్లు ఆరోపించారు.
ఈ కేసుపై కోర్టు గత మూడేండ్లుగా విచారణ జరిపింది. శిశువుల రక్తప్రవాహంలోకి గాలి, ఇన్సులిన్ను సిరంజి ద్వారా పంపడం, పాలు, ఇతర ద్రవాలను బలవంతంగా అధిక మోతాదులో తాగించడం వంటి క్రూర చర్యల ద్వారా శిశువులను 33 ఏండ్ల లూసీ లెట్బీ చంపినట్లు నిరూపణ అయ్యింది. శుక్రవారం ఆమెను దోషిగా నిర్ధారించిన కోర్టు, జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆ నర్సు గుట్టును రట్టు చేసిన డాక్టర్ రవి జయరామ్, కోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆ నర్సు వృత్తి ద్రోహాన్ని ఒక టీవీ చానెల్ ఇంటర్వ్యూలో ఎండగట్టారు.