వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా దిగి వచ్చింది. కరోనాతో అతలాకుతలమైన ఇండియాను ఆదుకోవాలంటూ అన్ని వైపుల నుంచి వచ్చిన ఒత్తిడికి తలొగ్గింది. ఇండియాకు అవసరమైన అదనపు సాయాన్ని శరవేగంగా అందించనున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ వెల్లడించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఇండియాకు సాయం చేయాలంటూ యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్తోపాటు అక్కడి చట్టసభల ప్రతినిధులు, ప్రముఖ ఇండియన్-అమెరికన్లు బైడెన్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లతోపాటు అవసరమైన ఇతర కొవిడ్ మందులను సరఫరా చేయాలని వాళ్లు డిమాండ్ చేశారు.
దీనిపై బ్లింకెన్ స్పందించారు. కొవిడ్ మహమ్మారితో సతమవుతున్న భారత ప్రజలకు అండగా ఉంటాం. భారత ప్రభుత్వంలో ఉన్న మా భాగస్వాములతో కలిసి పని చేస్తున్నాం. ఇండియాకు అవసరమైన అదనపు సాయాన్ని శరవేగంగా అందిస్తాం అని బ్లింకెన్ చెప్పారు. అటు వైట్హౌజ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జేక్ సల్లివాన్ కూడా దీనిపై స్పందించారు. ఇండియాలో కొవిడ్ పరిస్థితులపై అమెరికా తీవ్ర ఆందోళన చెందుతోంది. ఇండియాలోని స్నేహితులు, భాగస్వాములతో కలిసి పని చేస్తున్నాం. కొవిడ్పై పోరాడుతున్న ఇండియాకు మరింత సాయం చేయడానికి 24 గంటలూ శ్రమిస్తున్నామని ఆయన అన్నారు.
అమెరికాలో కరోనా విజృంభించిన సమయంలో ఇండియా ముందుకు వచ్చి సాయం చేసినా.. ఇప్పుడు అగ్రరాజ్యం మాత్రం ఆ పని చేయకపోవడంపై బైడెన్ ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంది. అమెరికా స్టోరేజ్లో ఉన్న కోట్లాది ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లను ఇండియాకు ఇవ్వాలని యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్తోపాటు కాంగ్రెస్ సభ్యులు రో ఖన్నా, రాజా కృష్ణమూర్తి బైడెన్ ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం అమెరికాలో 4 కోట్ల ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ డోసులు ఉన్నట్లు కృష్ణమూర్తి తెలిపారు. వీటిని అమెరికా ఉపయోగించడం లేదని, మెక్సికో, కెనడా కోసం పక్కన పెట్టిన వీటిలో నుంచి ఇండియాకు కూడా ఇవ్వాలని ఆయన కోరారు.
Our hearts go out to Indian people in the midst of the horrific COVID outbreak. We're working closely with our partners in the Indian govt, and we'll rapidly deploy additional support to the people of India & India's healthcare heroes: US Secretary of State Antony Blinken pic.twitter.com/VVCSshTwyN
— ANI (@ANI) April 25, 2021