హైదరాబాద్, మార్చి 31: రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల (Anganwadi Centres) నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ నెలలో అంగన్వాడీ కేంద్రాలను హాఫ్ డే పద్ధతిలో నిర్వహించేందుకు అనుమతించింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30 వరకు అంగన్వాడీ కేంద్రాలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం12.30 గంటల వరకు పనిచేస్తాయి. మే 1 నుంచి మే 31 వరకు అంగన్వాడీ పిల్లలకు వేసవి సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంగన్వాడీ పిల్లలతో పాటు టీచర్లు హెల్పర్లకు సెలవులు మంజూరు చేశారు.
అయితే, సెలవుల సమయంలో అంగన్వాడీ సిబ్బంది కొన్ని బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. పిల్లలకు సరుకులును ఇంటికి (THR) పంపిణీ చేయాలి. 0–5 సంవత్సరాల పిల్లల్లో అభివృద్ధి సంబంధిత లోపాలను ముందుగానే గుర్తించేందుకు ఇంటింటి సర్వేలు నిర్వహించాలి. ప్రీ-స్కూల్లో పిల్లల నమోదు. డ్రాప్ఔట్ అయిన పిల్లలను మళ్లీ అంగన్వాడి కేంద్రాల్లో చేర్చే విధంగా చర్యలు చేపట్టాలి.
వేసవి సెలవుల్లో అంగన్వాడీ సిబ్బంది తాము నిర్వహించిన కార్యకలాపాలపై సమగ్ర నివేదిక సమర్పించాలి. ఏప్రిల్ 27 నుంచి మే 2 వరకు జరిగే ‘చైల్డ్ సేఫ్టీ వీక్’, మే 25 నుంచి మే 30 వరకు నిర్వహించే ‘వుమెన్ థీమ్ వీక్’ కార్యక్రమాల్లో అంగన్ వాడీ సిబ్బంది పాల్గొనాలని మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రెటరీ అనితా రామచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు.