కొలంబో, జూలై 20: ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో కునారిల్లుతున్న ద్వీపదేశం శ్రీలంకకు కొత్త అధ్యక్షుడిగా సీనియర్ నాయకుడు రణిల్ విక్రమసింఘే ఎన్నికయ్యారు. ప్రజాగ్రహానికి భయపడి అధ్యక్షుడు గొటబయ రాజపక్స దేశం విడిచి పారిపోవటంతో శ్రీలంక పార్లమెంటు బుధవారం కొత్త అధ్యక్షుడిని ఎన్నుకొన్నది. దేశ ప్రధానిగా, తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతున్న రణిల్ విక్రమసింఘేకు పార్లమెంటులో స్పష్టమైన మెజారిటీ వచ్చింది. 225 సభ్యులుగల పార్లమెంటులో విక్రమసింఘేకు 134 మంది ఎంపీలు మద్దతు పలికారు. ఆయన సమీప ప్రత్యర్థి, అధికార పార్టీ అభ్యర్థి దుల్లాస్ అలహప్పెరుమాకు 82 ఓట్లు రాగా, వామపక్ష జనతా విముక్తి పెరుమన అభ్యర్థి అనుర కుమార దిస్సనాయకేకు కేవలం మూడు ఓట్లు వచ్చాయి. అధ్యక్షుడిగా విక్రమసింఘే గురువారం ప్రమాణం చేసే అవకాశం ఉన్నది. ఇదిలా ఉండగా విక్రమసింఘేను అధ్యక్షుడిగా అంగీకరించేదిలేదని ఆందోళనకారులు అంటున్నారు. బుధవారం ఆయనకు వ్యతిరేకంగా దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. లంక రాజకీయాల్లో భారత ప్రభుత్వం జోక్యం చేసుకొంటున్నదని స్థానిక మీడియాలో వచ్చిన కథనాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ కథనాల నేపథ్యంలో లంకలోని భారత పాస్పోర్టు కార్యాలయం అధికారిపై రెండురోజుల క్రితం దాడి కూడా జరిగింది. ఈ మీడియా కథనాలను భారత రాయబార కార్యాలయం ఖండించింది.
కలిసి దేశాన్ని కాపాడుదాం
అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత విక్రమసింఘే మాట్లాడారు. ప్రజలు కొత్త రాజకీయాలు కోరుకొంటున్నారని, కష్ట సమయంలో దేశాన్ని కాపాడేందుకు అన్నిపార్టీలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ‘గత 48 గంటలు మనం విడివిడిగా పనిచేశాం. ఆ కాలం ముగిసింది. ఇప్పుడు మనమంతా కలిసి పనిచేయాల్సిన సమయం ఆసన్నమైంది. మాజీ అధ్యక్షులు మైత్రిపాల సిరిసేన, మహింద రాజపక్సలతోపాటు ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాసకు ఒక్కటే విజ్ఞప్తిచేస్తున్నా.. రండి.. అందరం కలిసి పనిచేద్దాం. ఏ విషయంపై అయినా మీతో చర్చించటానికి నేను సిద్ధంగా ఉన్నాను’ అని పేర్కొన్నారు. విక్రమసింఘేకు భారత్ శుభాకాంక్షలు తెలిపింది. శ్రీలంకకు తమ మద్దతు కొనసాగుతుందని ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది.
రణిల్ వద్దు..
శ్రీలంక అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘేకు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనకారులు అంటున్నారు. దేశాన్ని దివాలా తీయించటంలో రాజపక్స కుటుంబంతోపాటు విక్రమసింఘేకు కూడా పాత్ర ఉన్నదని ఆరోపిస్తున్నారు. బుధవారం ఆయన అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే అనేక ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. ప్రజాగ్రహానికి భయపడి ప్రధాని పదవికి మహింద రాజపక్స రాజీనామా చేయటంతో మే నెలలో రణిల్ను అప్పటి అధ్యక్షుడు గొటబయ ప్రధానిగా నియమించారు. ఆయన నియామకాన్ని కూడా నిరసనకారులు అంగీకరించలేదు. రాజపక్స కుటుంబంతో రణిల్ కుమ్మక్కయ్యారని, గొటబయతోపాటు రణిల్ కూడా పదవుల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. కొలంబోలోని రణిల్ ప్రైవేటు నివాసంతోపాటు ప్రధాని కార్యాలయంపై దాడులు కూడా చేశారు.
తిండికోసం ఒళ్లు అమ్ముకొంటున్న మహిళలు
శ్రీలంకలో తినటానికి తిండి కూడా దొరక్క ప్రజలు డొక్కలు ఎండి మరణిస్తున్నారు. మహిళల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉన్నది. కొందరు మహిళలు ఆకలి తీర్చుకొనేందుకు ఏకంగా వ్యభిచార వృత్తిలోకి దిగుతున్నట్టు మీడియా కథనాలు వస్తున్నాయి. దీనినిబట్టే అక్కడ ఆకలి కేకలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
మా జోక్యంలేదు: భారత్
లంక ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనకారులు భారత్కు కూడా వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు. అదానీ సంస్థకు 500 మెగావాట్ల విండ్ పవర్ప్లాంటు కాంట్రాక్టు కట్టబెట్టేందుకు భారత ప్రధాని మోదీ శ్రీలంక అధ్యక్షుడిపై ఒత్తిడి తెచ్చారని బయటపడటంతో ఇప్పటికే ఆ దేశ ప్రజలు భారత్పట్ల వ్యతిరేకత చూపుతున్నారు. తాజాగా లంక రాజకీయాల్లో భారత ప్రభుత్వం జోక్యం చేసుకొంటున్నదని వార్తా కథనాలు వెలువడ్డాయి. దీంతో మంగళవారం కొలంబోలోని భారత పాస్పోర్టు కార్యాలయంపై కొందరు దాడి చేసి ఓ అధికారిని గాయపర్చారు. ఈ నేపథ్యంలో లంక రాజకీయాల్లో భారత్ ఎలాంటి జోక్యం చేసుకోవటంలేదని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది.