దోహా: ఇజ్రాయెల్, హమాస్ మధ్య బంధీలు, ఖైదీల మార్పిడికి (Hostages-Prisoners Swap) ఖతార్ మధ్యవర్తిత్వం వహిస్తున్నది. ఇరు వర్గాలతో ఆ దేశం సంప్రదింపులు జరుపుతున్నది. అమెరికా సమన్వయంతో శనివారం రాత్రి నుంచి జరుగుతున్న ఈ చర్చలు సానుకూలంగా ఉన్నట్లు ఖతార్ వర్గాలు తెలిపాయి. శనివారం ఇజ్రాయెల్పై అనూహ్యంగా దాడి చేసిన హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ సైనికులతోపాటు పౌరులను బంధీలుగా తీసుకెళ్లారు. ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న 36 మంది పాలస్తీనా మహిళలు, పిల్లలను విడుదల చేయాలని గతంలో వారు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్, హమాస్తో ఖతార్ చర్చలు జరుపుతున్నది. ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న 36 మంది పాలస్తీనా మహిళలు, పిల్లల విడుదలకు బదులుగా హమాస్ ఉగ్రవాదులు గాజాలో బంధించిన ఇజ్రాయెల్ మహిళలు, పిల్లలను విడిచిపెట్టాలని హమాస్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నది. అమెరికా సమన్వయంతో శనివారం రాత్రి నుంచి జరుగుతున్న ఈ చర్చలు సానుకూలంగా ఉన్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. అయితే ఇజ్రాయెల్, హమాస్ మధ్య దాడులు, ప్రతిదాడుల కారణంగా ఈ దిశగా ఎలాంటి పురోగతి లేదని పేర్కొన్నాయి.
మరోవైపు ఇజ్రాయెల్, హమాస్ మధ్య పోరు మరింత పెరుగకుండా నిరోధించేందుకు ఇరు వర్గాలతో సన్నిహితంగా ఉన్న ఈజిప్ట్ ప్రయత్నిస్తున్నది. సంయమనం పాటించాలని ఇజ్రాయెల్ను కోరింది. అలాగే బంధీలకు ఎలాంటి హాని తలపెట్టవద్దని హమాస్కు సూచించింది. అయితే గాజాపై దాడులను ఇజ్రాయెల్ తీవ్రం చేయడంతో మధ్యవర్తిత్వం కష్టంగా మారినట్లు ఈజిప్ట్ వర్గాలు వెల్లడించాయి.