మాస్కో : ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ చర్చలు విఫలం కావటంతో.. పశ్చిమాసియా సంక్షోభంపై మళ్లీ ఆందోళన నెలకొన్నది. ఈ తరుణంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ నుంచి అనూహ్యమైన ప్రతిపాదన వెలువడింది. అమెరికాతో చర్చల కోసం తాను మధ్యవర్తిత్వం వహిస్తానంటూ పుతిన్ ముందుకొచ్చారు. ఈ విషయాన్ని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్తో చెప్పినట్టు రష్యా అధ్యక్ష కార్యాలయం ‘క్రెమ్లిన్’ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఇస్లామాబాద్లో అమెరికా-ఇరాన్ మధ్య ముఖాముఖి చర్చలు ఎలాంటి ఒప్పందం కుదర్చుకోకుండానే ముగిశాయి. దీంతో రెండు వారాల సీజ్ఫైర్పై అనుమానాలు నెలకొన్నాయి. ఇరాన్ అణు కార్యక్రమంపై నెలకొన్న వివాదాన్ని రాజకీయ, దౌత్యమార్గంలో పరిష్కరించాలని పుతిన్ ఇంతకుముందు కూడా వాదించారు.