మాస్కో/కీవ్, మే 3: రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈనెల 9న ఉక్రెయిన్పై యుద్ధాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలుస్తున్నది. ఈ చర్యతో రష్యా తన వద్ద ఉన్న రిజర్వ్ బలగాలను కూడా ఉక్రెయిన్ ఆక్రమణకు పూర్తిస్థాయిలో మోహరించేందుకు వీలు కల్పిస్తుందని అమెరికా, పశ్చిమ దేశాల అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఉక్రెయిన్పై తాము చేపట్టింది ప్రత్యేక సైనిక చర్యగా ఇప్పటి వరకు పుతిన్ చెబుతూ వస్తున్నారు.
మరియుపోల్లో ఇంకా అధీనంలోకి రాని అజోవ్స్టల్ స్టీల్ప్లాంట్పై రష్యా దాడులు తీవ్రతరం చేసింది. ఫిరంగులు, యుద్ధ విమానాలతో దాడులు చేసిందని ఉక్రెయిన్ ఆర్మీ మంగళవారం పేర్కొన్నది. ఇదే సమయంలో ప్లాంట్ నుంచి పౌరుల తరలింపు ప్రక్రియ కొనసాగుతున్నది. 127 మంది జపోరిజ్జియాకు చేరుకున్నాయని ఐరాస పేర్కొన్నది. ఉక్రెయిన్ పార్లమెంట్ను ఉద్దేశించి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రసంగించారు. రష్యాతో వీరోచిత పోరాటాన్ని ప్రశంసించారు.
ఉక్రెయిన్లో తక్షణం కాల్పులు విరమణ పాటించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోరారు. సమస్య పరిష్కారానికి రెండు దేశాలు తక్షణమే చర్చలు జరుపాలని సూచించారు. మూడు రోజుల ఐరోపా పర్యటనలో భాగంగా మంగళవారం డెన్మార్క్ ప్రధాని మెట్టె ఫ్రెడెరిక్సన్తో మోదీ భేటీ అయ్యారు.