Vladimir Putin | మాస్కో : ఉక్రెయిన్తో యుద్ధం ప్రపంచ యుద్ధ స్వభావాన్ని సంతరించుకుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. పాశ్చాత్య దేశాల వల్లే ఈ యుద్ధం తీవ్రతరమవుతున్నదని ఆరోపించారు. ఈ ఘర్షణ మరింత ఉధృతమైతే, ప్రతీకార చర్యలు చేపట్టే హక్కు రష్యాకు ఉందన్నారు. ఉక్రెయిన్కు ఆయుధాలు ఇచ్చి, ఘర్షణను ఎగదోస్తున్న దేశాల్లోని సైనిక స్థావరాలపై దాడులకు వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. ప్రపంచంలో ప్రస్తుత ఉద్రిక్తతలకు కారణం అమెరికాయేనని పుతిన్ పునరుద్ఘాటించారు.
ఇదిలావుండగా, రష్యా కొత్త బ్యాలిస్టిక్ మిసైల్ను మోహరించిన నేపథ్యంలో, శుక్రవారం జరగవలసిన ఉక్రెయిన్ పార్లమెంటు సెషన్ రద్దయింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కార్యాలయం స్టాండర్డ్ సెక్యూరిటీ మెజర్స్ ప్రకారం కార్యకలాపాలను కొనసాగిస్తున్నది. తన కొత్త ప్రయోగాత్మక హైపర్సోనిక్ క్షిపణిని ఉక్రెయిన్పై ప్రయోగించినందుకు రష్యాపై చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాల నేతలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కోరారు. నిజమైన శాంతి కోసం రష్యాను ప్రపంచ దేశాలు కోరాలని, బలప్రయోగం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుందని అన్నారు.
2024లో మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమైందని ఉక్రెయిన్ మాజీ మిలిటరీ కమాండర్-ఇన్-చీఫ్ వలెరీ జలుజ్నీ చెప్పారు. ఉక్రెయిన్స్క యూపీ100 అవార్డ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఈ యుద్ధంలో రష్యా నియంతృత్వ మిత్రులు పాల్గొంటున్నందువల్ల, ఇది అంతర్జాతీయ స్థాయికి విస్తరించిందని చెప్పవచ్చునన్నారు. ఉత్తర కొరియా సైన్యం ఉక్రెయిన్ ముందు నిల్చుందని, ఇరానియన్ ‘షాహెదీస్’ బాహాటంగానే ఉక్రెయిన్ ప్రజలను చంపుతున్నారని తెలిపారు. చైనా ఆయుధాలు యుద్ధంలో కనిపిస్తున్నాయని చెప్పారు.