రాజపక్స సోదరులపై చల్లారని ఆగ్రహజ్వాల
గొటబయ లంకలోనే దాక్కున్నట్టు వార్తలు
కొలంబో, జూలై 12: శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స ఇప్పటికీ శ్రీలంకలోనే ఉన్నట్టు అనుమానాలు కలుగుతున్నాయి. సోమవారం గొటబయ, ఆయన భార్య, కుటుంబసభ్యులకు చెందిన దాదాపు 15 పాస్పోర్టులను ఆయన సన్నిహితులు కొలంబో ఎయిర్పోర్టుకు తీసుకొచ్చారు. వీటికి వెంటనే క్లియరెన్స్ ఇవ్వాలని అధికారులకు సూచించారు. అయితే నిబంధనల ప్రకారం ఎవరైనా దేశం విడిచి వెళ్లాలంటే పాస్పోర్టుతో స్వయంగా హాజరుకావాలి. కానీ గొటబయ, ఆయన కుటుంబసభ్యులు హాజరు కానందునా ఇమ్మిగ్రేషన్ అధికారులు తిరస్కరించారు. అంతేగాక ప్రముఖులు దేశం విడిచి పారిపోకుండా అధికారులు చూస్తుండటం కూడా ఓ కారణం. మిలిటరీ వర్గాల అత్యంత కీలక సమాచారం ప్రకారం గొటబయ, ఆయన భార్య అయోమా రాజక్స తదితరులు కొలంబో నుంచి దుబాయ్కి వెళ్లడానికి శ్రీలంక ఎయిర్లైన్స్ టికెట్లు బుక్ చేసుకున్నట్టు సీఎన్ఎన్ వార్తా సంస్థ తెలిపింది.
గొటబయ ప్రస్తుతం నౌకాదళ అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ సుదర్శన పథ్రిరానకు చెందిన ఇంట్లో తలదాచుకున్నట్టు వదంతలు వస్తున్నాయి. ఇదే సమయంలో మంగళవారం గొటబయ సోదరుడు, ఆర్థిక శాఖ మాజీ మంత్రి బసిల్ రాజపక్స కూడా దేశాన్ని విడిచి పారిపోవడానికి ప్రయత్నించాడు. దీంతో ప్రజలతోపాటు ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. ‘మంగళవారం బసిల్ రాజపక్స కొలంబో విమానాశ్రయానికి వచ్చారు. దుబాయ్ చేరుకొని అక్కడి నుంచి అమెరికాకు పారిపోవాలనుకున్నారు. కానీ అక్కడున్న ప్రజలు ఆయనను గుర్తించి నిరసన చేపట్టారు. పారిపోకుండా అడ్డుకున్నారు’ అని శ్రీలంక ఇమ్మిగ్రేషన్ అధికారుల సంఘం చైర్మన్ కనుగాల చెప్పారు. శ్రీలంక నుంచి ప్రముఖులు పారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, కాబట్టి వాళ్లు పారిపోకుండా అడ్డుకోవాలని నిర్ణయించామని తెలిపారు.
శ్రీలంక తదుపరి అధ్యక్షుడిగా సుజిత్ ప్రేమదాసను నామినేట్ చేయనున్నట్టు సమాచారం.