Ebola : ఎబోలా విజృంభణతో అల్లాడుతున్న ఆఫ్రికా దేశమైన కాంగోలో హింసాత్మక ఘటన జరిగింది. ఎబోలాతో మరణించిన రోగి మృతదేహం అప్పగించకపోవడంతో కొంతమంది ఆందోళనకారులు ఏకంగా ఎబోలా సెంటర్ను తగులబెట్టారు. ఈ ఘటన గురువారం డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగోలోని ఇటురి ప్రావిన్స్ పరిధిలోని రాంపారాలో జరిగింది.
అంతర్జాతీయ మీడియా కథనం ప్రకారం.. ఇక్కడ ఒక ఎబోలా చికిత్సా కేంద్రం నిర్వహిస్తున్నారు. ఒక వ్యక్తి ఇక్కడి కేంద్రంలో అనారోగ్యంతో మరణించాడు. అతడి మృతదేహాన్ని అప్పగించాలని అతడి బంధువులు, స్థానికులు కలిసి ఎబోలా సెంటర్కు చేరుకున్నారు. అతడి మృతదేహాన్ని అప్పగించాలని కోరారు. కానీ, దీనికి అక్కడి వైద్యాధికారులు నిరాకరించారు. అంత్యక్రియలు నిర్వహించే క్రమంలో ఎబోలా మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని అధికారులు భావించారు. మృతదేహాన్ని తాకడం వల్ల మరింత మందికి ఎబోలా వ్యాపించే అవకాశం ఉంది. దీంతో అధికారులు రోగి మృతదేహాన్ని అప్పగించలేదు. దీనికి ఆగ్రహించిన స్థానికులు, బంధువులు వైద్యాధికారులతో ఘర్షణకు దిగారు.
ఈ క్రమంలో అక్కడి ఎబోలా సెంటర్లోని టెంట్ను ధ్వంసం చేశారు. మంటపెట్టారు. వైద్య సామగ్రిని ధ్వంసం చేశారు. ఈ సమయంలో అక్కడ చికిత్స పొందుతున్న రోగుల్ని మరోచోటుకు సురక్షితంగా తరలించారు. ఒక సిబ్బందికి మాత్రం గాయాలయ్యాయి. ఈ ఘర్షణ అనంతరం ఇక్కడ భారీ భద్రతను మోహరించారు. ఎబోలాతో మరణించిన వారికి ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఎబోలా మళ్లీ వ్యాపించకుండా, ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎబోలా ఇంకా వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నారు.